దేశంలో మళ్ళీ కరోనా పంజా ..మహారాష్ట్రలో కొత్త వైరస్ వ్యాప్తి , గత 24 గంటల్లో కేసులు ఎన్నంటే
ఇండియాలో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. చాప కింద నీరులా కరోనా కేసులు విస్తరిస్తున్నాయి. మహారాష్ట్రలో తీవ్రంగా ప్రభావితం చేసిన కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి మళ్లీ మరోసారి మహారాష్ట్ర ను వణికిస్తుంది. గత 24 గంటల్లో దేశంలో 13,193 కొత్త కేసులు నమోదు కాగా 97 మరణాలు సంభవించాయి. మొన్నటి వరకు తగ్గినట్టే భావించినా మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది .

భారతదేశంలో నమోదైన మొత్తం కేసులు 1,09,63,394
ఇప్పటి వరకు భారతదేశంలో నమోదైన మొత్తం కేసులు 1,09,63,394 కాగా , కరోనా కారణంగా సంభవించిన మరణాలు 1,56,111. ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1,39,542 గా ఉంది . గత 24 గంటల్లో 10,896 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు . ఇక మహారాష్ట్ర , కేరళ వంటి రాష్ట్రాలలో మళ్ళీ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి .కరోనా మహమ్మారి దెబ్బకు
విదర్భలోని అమరావతి, యావత్మల్ మరియు అకోలా మూడు జిల్లాలలో మహారాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది.

మహారాష్ట్రలో రెండు 'ప్రత్యేకమైన' కరోనా రకాలు
ఈ మూడు పెద్ద ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించటంతో పాటుగా లాక్డౌన్ లాంటి ఆంక్షలను అమలు చేయాలని నిర్ణయించింది. మహారాష్ట్ర రెండు 'ప్రత్యేకమైన' కోవిడ్ జాతులతో ఇబ్బంది పడుతుందని, అందులో ఒకటి న్యుమోనియాను ప్రేరేపిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
న్యుమోనియా ప్రారంభంలోనే కనబడుతోందని చెప్తున్నారు. తద్వారా కేసులు వేగంగా పెరిగితే ఎక్కువ మంది మరణించే అవకాశం పెరుగుతుంది అని వైద్య నిపుణులు అంటున్నారు.

న్యుమోనియా లక్షణాలతో కరోనా కొత్త వైరస్ వ్యాప్తి
ఒక్క అమరావతి కేంద్రంలో 700 మందిలో 350 మంది పాజిటివ్ గా నిర్ధారణ అయిందని చెప్పారు. ఈ వ్యాప్తి నాగ్పూర్ నుంచి ఔరంగాబాద్ వరకు ఉంటుందని ఆయన అన్నారు. అమరావతి మరియు అకోలా జిల్లాల్లో కొనసాగుతున్న వైరల్ వ్యాప్తి చాలా అసాధారణమైన వ్యాప్తి అని, కోవిడ్ రోగులలో న్యుమోనియా ప్రారంభంలోనే కనిపిస్తున్నట్టుగా ఉందని పేర్కొన్నారు. ఏది ఏమైనా ఫిబ్రవరి రెండో వారంలో మహారాష్ట్రలో ప్రతిరోజు మూడు వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఆ సంఖ్య మరింత పెరుగుతుంది.

కేరళలోనూ కరోనా కేసుల పెరుగుదల .. బీ అలెర్ట్ అంటున్న వైద్యనిపుణులు
మరోపక్క కేరళ రాష్ట్రంలోనూ కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ప్రజల్లో కనిపిస్తున్న నిర్లక్ష్యమే కరోనా కేసులు విపరీతంగా పెరగడానికి కారణమని భావిస్తున్నారు. మాస్కులు ధరించకపోవటం, చేతులు శుభ్రపరుచుకోకపోవటం వంటి నిర్లక్ష్యాలే మళ్ళీ ప్రజలను కరోనా బారిన పడేస్తున్నాయి . నిర్లక్ష్యాన్ని వీడి దేశం మొత్తం వ్యాక్సినేషన్ పూర్తయ్యేవరకూ ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వైద్య శాఖ అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications