ఇండియాలో కరోనా పంజా ... 78 వేలకు పెరిగిన కేసులు ..లాక్ డౌన్ సడలింపులే కారణమా !!
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తుంది . ఇక ఇండియా విషయానికి వస్తే కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు భారతదేశంలో 78,056 కేసులు నమోదు అయ్యాయి అంటే ఎంతగా కరోనా వ్యాపిస్తుందో అర్ధం చేసుకోవచ్చు .ఇండియాలో కొత్త కేసులు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. గత నాలుగురోజులలోనే 10వేల కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే అంశం. కరోనా లాక్ డౌన్ పొడిగించినా కొన్ని సడలింపులు ఇచ్చి జనజీవనం ఆగకుండా కొనసాగేలా చేస్తుంది. లాక్డౌన్ ఉంటే ఓ సమస్య, లేకపోతే మరో సమస్య లా ఉంది ప్రస్తుత పరిస్థితి .
Recommended Video
భారత్ లో కరోనా లాక్డౌన్ కారణంగా వైరస్ వ్యాప్తిని అరికట్టామని పాలకులు చెపుతున్నప్పటికి కరోనా మాత్రం తన పంజా విసురుతూనే ఉంది .వైరస్ దాని ప్రభావం ఏ మాత్రం తగ్గటం లేదు. లాక్ డౌన్ సడలింపులతో దేశంలో కరోనా పాజిటివ్ కేసులు అమాంతం పెరిగిపోతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ తాజా ప్రకటనను పరిశీలిస్తే గత 24 గంటల్లోనే 3,722 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 78 వేలు దాటింది. దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 78,056కి చేరింది. ఇక ఈ వైరస్ బారిన పడి ఇప్పటివరకు దేశంలో 2,551 మంది మరణించారని గత 12 గంటల్లోనే 136 మృతి చెందినట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది.

49,086 మందికి వివిధ అస్పతుల్లో చికిత్స కొనసాగుతుందని, కరోనా నుంచి ఇప్పటి వరకు 26,414 మంది బాధితులు కోలుకునట్టు ఆరోగ్య శాఖ ప్రకటించింది . దేశ వ్యాప్తంగా గత కొద్దిరోజుల నుంచి లాక్డౌన్ సడలింపులు అమలవుతున్నాయి. ఇక పలు రాష్ట్రాలు వైన్ షాపులు కూడా ఓపెన్ చెయ్యటం , కొన్ని రంగాలకు లాక్ డౌన్ నిబంధనల నుండి వెసులుబాటు ఇవ్వటం , ప్రజలు భౌతిక దూరం పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడం వల్లనే దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే విధంగా కొనసాగితే ఈ నెలాఖరు వరకు 2 లక్షల కేసులు నమోదైనా ఆశ్చర్యపోనవసరం లేదని పేర్కొన్నారు .












Click it and Unblock the Notifications