హోలీ వేడుకలపై కరోనా ఎఫెక్ట్ .. ఢిల్లీలో మూడు రోజుల లాక్ డౌన్ కు ఆప్ సర్కార్ యోచన !!
భారతదేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న తరుణంలో ఇప్పటికే కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదే సమయంలో వస్తున్న హోలీ పండుగ ప్రభుత్వాలకు పెద్ద తలనొప్పిగా మారింది. హోలీ పండుగ సందర్భంగా కరోనా నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి అందరూ హోలీ ఉత్సవాలను జరుపుకుంటే, సామాజిక దూరం పాటించకుండా గుంపులుగా రంగులతో ముంచెత్తితే కరోనా మరింత ప్రబలే అవకాశం ఉన్నట్లుగా, ఆపై లాక్ డౌన్ విధించడం అనివార్యంగా మారే పరిస్థితులు ఉన్నట్లుగా నిపుణులు అంచనా వేస్తున్నారు.
కరోనా ప్రభావిత రాష్ట్రాల్లో హోలీ వేడుకలపై దృష్టి పెట్టిన ప్రభుత్వాలు
ఈ నేపథ్యంలో హోలీ పండుగ పై ఆంక్షలు విధించడంపై కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు దృష్టి సారించాయి.
ఇప్పటికే కరోనా మహమ్మారి విజృంభిస్తున్న మహారాష్ట్రలోని కరోనా ప్రభావిత జిల్లాల్లో లాక్ డౌన్ విధించారు. పంజాబ్ లో నైట్ కర్ఫ్యూను కొనసాగిస్తున్నారు. కర్ణాటక, గుజరాత్ వంటి రాష్ట్రాలలోనూ కరోనా ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా జరగనున్న హోలీ వేడుకలపై కరోనా ఎఫెక్ట్ పడింది.
ఢిల్లీలో హోలీ వేడుకలను కట్టడి చేసే ప్లాన్ .. మూడు రోజుల లాక్ డౌన్ విధింపు యోచన
ఇప్పటికే ఢిల్లీలో హోలీ వేడుకలపై ఆంక్షలు విధించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఢిల్లీలో ఈ నెల 28, 29, 30 తేదీలలో లాక్ డౌన్ విధిస్తే హోలీ కారణంగా వ్యాప్తి చెందుతుంది అని భావిస్తున్న కరోనా నియంత్రించవచ్చని ప్రభుత్వం యోచిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే గుజరాత్, ఒడిశా రాష్ట్రాలలో హోలీ వేడుకలపై నిషేధం విధించారు . ఒడిశాలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా 28 , 29 తేదీలలో హోలీ వేడుకలు నిర్వహించరాదని బ్యాన్ విధించారు.
తెలుగు రాష్ట్రాల్లోనూ పెరుగుతున్న కరోనా కేసులు .. హోలీ వేడుకలపై డైలమా
తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. ఇక దేశంలోని నాలుగు రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికల నేపథ్యంలో కొనసాగుతున్న ఎన్నికల ప్రచారం వల్ల కేసులు పెరుగుతున్నాయి. ఇదే సమయంలో హోలీ పండుగ కూడా ప్రస్తుతం ప్రభుత్వాలను భయపెడుతుంది. హోలీకి మరి కొద్ది రోజుల సమయం ఉన్న నేపథ్యంలో హోలీ విషయంలో ఏ ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది.
దేశ వ్యాప్తంగా 80 జిల్లాలలో లాక్ డౌన్ .. హోలీపై ఆంక్షలు లేకుంటే కరోనా కట్టడి కష్టమే
ఇక ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 80 జిల్లాలలో కేంద్రం లాక్ డౌన్ విధించింది . అక్కడ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది . ఏది ఏమైనప్పటికీ కేసుల పెరుగుదల దృష్ట్యా ఈ ఏడాది హోలీ కి దూరంగా ఉంటేనే మంచిదనే భావన నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. కరోనా కేసులు ప్రమాదకరంగా పెరుగుతున్న తరుణంలో సామూహికంగా పండుగలు , వేడుకలు మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది లేదంటే భారతదేశంలో మరింత దారుణమైన కరోనా పరిస్థితులు నెలకొంటాయని వారంటున్నారు.