మళ్ళీ కరోనా కేసుల క్షీణత; భారత్ కు ఊరట: తాజాగా 20 వేల దిగువకు కొత్త కేసులు, 248 మరణాలు
భారతదేశం కరోనా కేసులను నమోదు చేస్తూనే ఉంది. గత 24 గంటల్లో భారతదేశంలో 20,000 కంటే తక్కువ కరోనా కేసులు నమోదు చేసింది. గత 24 గంటల్లో కొత్త కోవిడ్-19 కేసులు 19,740 గా నమోదయ్యాయి. దీంతో ప్రస్తుతం దేశంలో మొత్తం కేసులు 3.39 కోట్లకు చేరుకున్నాయి. దేశంలో నిన్న 21,257 కేసులు నమోదు కాగా నిన్నటి సంఖ్య కంటే తాజా కేసులు ఏడు శాతం తక్కువ. కరోనావైరస్ కారణంగా దేశం 248 మరణాలను కూడా నివేదించింది. మరొకసారి తక్కువగా కరోనా కేసులు నమోదు కావడం, క్రియాశీల కేసులు కూడా తగ్గుముఖం పట్టడం భారతదేశానికి ఊరట కలిగిస్తున్న అంశం.
భారత్ లో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 2,36,643
భారతదేశంలో యాక్టివ్ కోవిడ్-19 కేసులు మొత్తం ఇన్ఫెక్షన్లలో 0.70 శాతం ఉన్నాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 2,36,643 గా ఉంది. జాతీయ కోవిడ్ -19 రికవరీ రేటు 97.98 శాతంగా నమోదైంది. గత 24 గంటల్లో కనీసం 23,070 రికవరీలు నమోదు కాగా, భారతదేశంలో మొత్తం రికవరీల సంఖ్య 3,32,48,291 కి చేరుకుంది. రోజువారీ పాజిటివిటీ రేటు 100 కి గుర్తించిన పాజిటివ్ కేసుల సంఖ్య 1.56 శాతంగా ఉంది. భారతదేశంలో వీక్లీ పాజిటివిటీ రేటు 1.62 శాతంగా ఉంది. భారతదేశంలో నేషనల్వైడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు 93.99 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోస్లు ఇవ్వబడ్డాయి.

కేరళ, మహారాష్ట్రల తాజా కేసుల స్థితి ఇదే
కేరళలో 10,944 తాజా కోవిడ్-19 కేసులు నమోదు కాగా 120 మరణాలు నమోదయ్యాయి. కేరళ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 47,74,666 కాగా మొత్తం మరణాలు 26,072 కి చేరాయి. కేరళలో కరోనా మరణాలు తక్కువగా నివేదించబడ్డాయని ఆరోపిస్తూ ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం తన అధికారిక మరణాల జాబితాలో మరో 7,000 మంది బాధితులను చేర్చాలని నిర్ణయించింది.కరోనా మహమ్మారి కారణంగా అత్యంత ప్రభావితమైన మహారాష్ట్రలో 2,620 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ఇది రాష్ట్రంలో కేసుల సంఖ్యను 65,73,092 కి తీసుకువెళ్ళింది. వీటిలో, ముంబైలో 532 కొత్త కేసులు మరియు 8 మరణాలు నమోదయ్యాయి.
వివిధ రాష్ట్రాల్లో కొత్త కేసుల నమోదు ఇలా
ఇదిలా ఉంటే తమిళనాడులో తాజా కరోనా కేసులు సంఖ్య 1,359 గా నమోదు కాగా, 20 మంది కరోనా కారణంగా మరణించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 693 కరోనా కొత్త కేసులు నమోదు కాగా ఆరుగురు కరోనా మహమ్మారికి నిన్న బలైపోయారు. కర్ణాటక రాష్ట్రంలో 397 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. ఐదుగురు కరోనా మహమ్మారికి బలైపోయారు. రాష్ట్రంలో 784 తాజా కేసులు నమోదైన తర్వాత పశ్చిమ బెంగాల్లో కోవిడ్ -19 సంఖ్య 15,74,801 కి పెరిగిందని ఆరోగ్య శాఖ బులెటిన్లో తెలిపింది. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల నేపథ్యంలో కరోనా కేసులు పెరిగినట్లుగా కనిపిస్తుంది. మిజోరంలో గత 24 గంటల్లో 1080 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదు కాగా రెండు మరణాలు సంభవించినట్లు రాష్ట్ర ఆరోగ్య బులెటిన్ తెలిపింది.
ఢిల్లీలో కరోనా వ్యాక్సిన్ ఒక్క డోసు కూడా తీసుకోకుంటే అఫీసుల్లోకి నో ఎంట్రీ
ఢిల్లీలో 0.06 శాతం పాజిటివిటీ రేటు నమోదవుతుంది. గత 24 గంటల్లో దేశ రాజధాని ఢిల్లీలో 39 తాజా కేసులు నమోదు కాగా, మరణాలు సున్నాగా నమోదైంది. ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఆదేశం ప్రకారం, ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు కనీసం ఒక షాట్ కోవిడ్ -19 వ్యాక్సిన్ అయినా తప్పనిసరిగా తీసుకోవాలి. వ్యాక్సిన్లు తీసుకోని వారు అక్టోబర్ 16 నుండి వారి కార్యాలయాలకు అనుమతించబడరు .












Click it and Unblock the Notifications