భారత్ లో మళ్ళీ పెరిగిన కొత్త కేసులు, మరణాలు .. తాజాగా 30,570 కరోనా కేసులు, 431 మరణాలు
భారతదేశంలో కరోనా మహమ్మారి కేసులు విజృంభిస్తూనే ఉన్నాయి. దేశంలో గత 24 గంటల్లో 30,570 తాజా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇది నిన్నటి కంటే 12.4 శాతం ఎక్కువ. గత రెండు రోజులుగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తున్నాయి. నాలుగు రోజుల తర్వాత ఇండియా మళ్ళీ 30 వేల మార్కును దాటింది.

దేశంలో మొత్తం యాక్టివ్ కేసులు 3,42,923
ఇప్పటి వరకు దేశంలో మొత్తం యాక్టివ్ కేసులు 3,42,923గా ఉన్నాయి. భారతదేశంలో యాక్టివ్ కోవిడ్-19 కేసులు మొత్తం కేసులలో 1.03 శాతం ఉన్నాయి. గత 24 గంటల్లో కనీసం 38,303 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం రికవరీలు 3,25,60,474 కాగా, రికవరీ రేటు 97.64 శాతంగా ఉంది. గత 24 గంటల్లో కరోనా కారణంగా 431 మంది మరణించారు. కేరళ రాష్ట్రంలో అత్యధికంగా 208 మంది నిన్న ఒక్కరోజు మరణించగా, తర్వాతి స్థానంలో 56 మరణాలతో మహారాష్ట్ర ఉంది. దీంతో మొత్తంగా కరోనా కారణంగా సంభవించిన మరణాల సంఖ్య 4,43,928గా నమోదైంది.

రోజువారీ పాజిటివిటీ రేటు 1.94 శాతం
గత 83 రోజులుగా వీక్లీ పాజిటివిటీ రేటు 1.93 శాతం 3 శాతం మార్క్ కంటే తక్కువగా ఉంది. గత 17 రోజులుగా రోజువారీ పాజిటివిటీ రేటు 1.94 శాతంగా నమోదైంది. ఇదిలా ఉంటే కేరళ రాష్ట్రంలో గత 24 గంటల్లో 17,641 కొత్త కేసులు నమోదు కావడం గమనార్హం. ఒక్క కేరళ రాష్ట్రంలోనే దాదాపు సగానికి ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి. ఇక ఇప్పటి వరకు భారతదేశంలో ఇచ్చిన మొత్తం టీకాల సంఖ్య 76,57,17,137 ఉంది. గత 24 గంటల్లో 64,51,423 మందికి కరోనా వ్యాక్సిన్స్ ను ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 76.57 కోట్ల డోసుల టీకాలు వేయబడ్డాయని ప్రభుత్వం తెలిపింది.

మహారాష్ట్రలో పెరుగుతున్న కరోనా కేసులు .. తాజా పరిస్థితి ఇదే
కరోనా కారణంగా అత్యధికంగా ప్రభావితం అయిన మహారాష్ట్ర నిన్న ఒక్కరోజే 3,783 కొత్త కరోనావైరస్ కేసులు మరియు 56 తాజా మరణాలను నివేదించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 65,07,930 కు చేరుకుంది. ఇక రాష్ట్రంలో మొత్తం మరణాలు 1,38,277 కు చేరుకుందని ఆరోగ్య శాఖ పేర్కొంది. మంగళవారంతో పోలిస్తే రోజువారీ కేసులు మరియు మరణాల సంఖ్య స్వల్పంగా పెరిగింది, అంతకు ముందు రోజు రాష్ట్రంలో 3,530 కోవిడ్ -19 కేసులు మరియు 52 మరణాలు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 4,364 మంది రోగులు ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారని సమాచారం. మహారాష్ట్రలో 49,034 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మహారాష్ట్ర కోవిడ్ -19 రికవరీ రేటు 97.07 శాతంగా ఉందని, మరణాల రేటు 2.12 శాతంగా ఉందని తెలుస్తుంది.
Recommended Video

డెల్టా వేరియంట్ ముప్పు ఇంకా పొంచి ఉందన్న నిపుణులు
కరోనా మహమ్మారి యొక్క డెల్టా ప్లస్ వేరియంట్ యొక్క ముప్పు ఇంకా పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇది B.1.617.2 జాతి యొక్క ఉత్పరివర్తన వెర్షన్, దీనిని ప్రపంచ ఆరోగ్య సంస్థ డెల్టా అని పిలిచింది. డెల్టా వేరియంట్ వల్లే కరోనా కేసులు ఎక్కువగా పెరుగుతున్నట్లుగా చెబుతున్నారు. డెల్టా జాతి కోవిడ్ -19 యొక్క రెండవ వేవ్ ఉదృతంగా కొనసాగడానికి కారణమైందని, లక్షలాది మంది మరణాలకు కారణమైందని, కాబట్టి డెల్టా వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. వ్యాక్సిన్ డోసులు తీసుకున్నప్పటికీ కరోనా పట్ల అప్రమత్తంగా లేకుంటే మహమ్మారి సోకే ప్రమాదం ఉందని పదేపదే చెబుతున్న పరిస్థితి ఉంది.












Click it and Unblock the Notifications