మళ్ళీ భయపెడుతున్న కరోనా: గత 24 గంటల్లో 22 వేలకు పైగా కొత్త కేసులు, 318 మరణాలు
భారతదేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత రెండు రోజులుగా 20 వేలకు దిగువన నమోదైన కరోనా కేసులు, మళ్లీ ఈ రోజు క్రమంగా పెరిగాయి. గత 24 గంటల్లో భారతదేశం 22,431 కొత్త కరోనా కేసులను నివేదించింది. నిన్న నమోదు అయిన కరోనా కేసుల కంటే, ఈరోజు నమోదైన కేసులు 19% ఎక్కువ. ఇదే సమయంలో 318 మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
దేశంలో మొత్తం కేసులు , మరణాల లెక్క ఇదే
కొత్తగా నమోదైన కరోనా కేసులతో పాటుగా, దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,38,94,312 కి చేరుకుంది. గత 24 గంటల్లో నమోదైన 318 మరణాలతో పాటు మొత్తం మరణాల సంఖ్య 4,49,856 కి పెరిగింది. ఇదిలా ఉంటే కరోనా టెస్ట్ పాజిటివిటీ రేటు 1.57 శాతంగా ఉంది. గత 38 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా ఉంది. యాక్టివ్ కేసులు మొత్తం ఇన్ఫెక్షన్లలో 1 శాతం కంటే తక్కువగా ఉన్నాయి, ప్రస్తుతం 0.72% శాతంగా ఉంది. జాతీయ కోవిడ్ -19 రికవరీ రేటు 97.95 శాతంగా నమోదైంది.

కేరళ, మహారాష్ట్రలలో కరోనా కొత్త కేసులు ఇలా
గత 24 గంటల్లో 98,782 నమూనాలను పరీక్షించినప్పుడు అత్యధిక రోజువారీ కేసులలో రాష్ట్రాలలో అగ్రస్థానంలో ఉన్న కేరళ 12,616 కేసులను నివేదించింది. గత 24 గంటల్లో కేరళ రాష్ట్రంలో 134 మరణాలు సంభవించాయి. కేరళ రాష్ట్రంలో ప్రస్తుతం 1,22,467 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న మహారాష్ట్రలో గత 24 గంటల్లో 2,876 కరోనా కేసులు నమోదు కాగా 90 మంది కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం మహారాష్ట్ర లో 33,181 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
తమిళనాడు, ఏపీ, కర్ణాటకలలో కరోనా కేసుల తాజా అప్ డేట్ ఇదే
తమిళనాడు రాష్ట్రం బుధవారం 1,432 కొత్త కోవిడ్ -19 కొత్త కేసులను నమోదు చేసింది. ఇప్పటి వరకు కేసుల సంఖ్య 26,72,843 కి చేరుకుంది. 25 మరణాలు రాష్ట్రంలో మరణాల సంఖ్యను 35,707 కి తీసుకెళ్లాయి. తమిళనాడు రాష్ట్రంలో ప్రస్తుతం 16,637 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 800 కరోనా కేసులు నమోదు కాగా తొమ్మిది మంది కరోనా కారణంగా మృతి చెందారు.ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 8,754 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక కర్ణాటక రాష్ట్రంలో 523 కొత్త కేసులు నమోదు కాగా తొమ్మిది మంది కరోనా కారణంగా మరణించారు.ఇదిలా ఉంటే 1,471 కేసుల వద్ద, మిజోరామ్ ఈశాన్య రాష్ట్రాలలో అత్యధిక రోజువారీ కేసులలో ముందంజలో ఉంది. నలుగురు సభ్యుల కేంద్ర బృందం రాష్ట్రంలో 15.36 శాతం ఆందోళనకరమైన పాజిటివిటీ రేటును అధ్యయనం చేస్తున్నట్లు ఆరోగ్య అధికారులు తెలిపారు.
దేశంలో వ్యాక్సినేషన్ ఇలా.. పండుగల సమయంలో అలెర్ట్
భారతదేశంలో కరోనా వ్యాక్సిన్ కార్యక్రమం యుద్ధప్రాతిపదికన కొనసాగుతోంది. కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం, భారత దేశంలో ఇప్పటి వరకు పంపిణీ అయిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 92.60 కోట్లు దాటింది. 43,09,565 కంటే ఎక్కువ టీకా మోతాదులను బుధవారం దేశం నమోదు చేసింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం పండుగల సీజన్ కావటంతో కేసులు పెరిగే ప్రమాదం ఉందని, పండుగల విషయంలో అలెర్ట్ గా ఉండాలని, కరోనా నిబంధనలు పాటించాలని ప్రభుత్వాలు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications