భారత్ లోకరోనా ఉగ్రరూపం : 4 లక్షలు దాటిన తాజా కేసుల రికార్డు, 3,523 మరణాలు
భారతదేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చింది. నాలుగు లక్షలు దాటిన కేసులతో కరోనా కలకలం సృష్టిస్తోంది.భారతదేశం మొదటిసారిగా 400,000 తాజా కోవిడ్ -19 కేసులను నివేదించిన పరిస్థితులు భారత దేశాన్ని మరింత దారుణ స్థితికి తీసుకు వెళుతుంది. దీంతో భారతదేశంలో మొత్తం కరోనా కేసులు 19 మిలియన్ మార్క్ ను మించిపోతుంది.
గత 24 గంటల్లో 4,01,993 కరోనా కొత్త కేసులు
కరోనా మహమ్మారి కేసులతో భారతదేశం భయంకరమైన పెరుగుదలను చూస్తుండగా దేశంలో పరిస్థితి దారుణంగా మారింది. ఈ రాష్ట్రం, ఆ రాష్ట్రం అన్న తేడా లేకుండా దేశం నలుమూలల నుండి కరోనా విరుచుకుపడుతోంది. గత 24 గంటల్లో 4,01,993 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. మే మొదటి రెండు వారాలలో కరోనా పీక్స్ కు చేరుతుందని నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో, తాజాగా పెరుగుతున్న కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తుంది.కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం శనివారం ఈ సంఖ్య 19 మిలియన్లను దాటింది.
గత 24 గంటల్లో 3,523 మంది కరోనాతో మృతి
ప్రపంచవ్యాప్తంగా ఒక్క రోజులో ఇంతగా అత్యధిక కేసులు నమోదు చేయడం, అది భారతదేశంలోనే చోటుచేసుకోవడం భారతదేశంలో తాజా కరోనా పరిస్థితికి అద్దం పడుతుంది. ఇక వరుసగా నాలుగో రోజు కూడా మూడు వేల మందికి పైగా కరోనాతో మృత్యువాతపడ్డారు. గత 24 గంటల్లో 3,523 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో కరోనా బారినపడి మృతి చెందినవారి సంఖ్య భారతదేశంలో 2,11,853కు చేరుకుంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 19,45,299 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా వారిలో 4,01,993 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
Recommended Video
32 లక్షలు దాటిన దేశవ్యాప్త క్రియాశీల కేసులు
గడచిన 24 గంటల్లో మూడు లక్షల మంది దాదాపుగా కరోనా నుండి కోలుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం రికవరీ ల సంఖ్య 1.57 కోట్లకు చేరుకుంది.రికవరీ రేటు ప్రస్తుతం 81.84 శాతంగా ఉంది. ఇదిలా ఉంటే క్రియాశీల కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసులు 32 లక్షలు దాటాయి. ప్రస్తుతం 32,68,710 కేసులు దేశంలో యాక్టివ్ కేసులు ఉన్నాయి.ఇక క్రియాశీల కేసుల రేటు 17.06 శాతానికి పెరిగింది. ఇదిలా ఉంటే భారతదేశంలో కరోనా వ్యాక్సిన్ కార్యక్రమం కొనసాగుతుంది.నిన్న ఒక రోజు 27 లక్షల మందికి కరోనావ్యాక్సిన్ ఇచ్చినట్లుగా అధికారిక లెక్కలు చెబుతున్నాయి.