రాష్ట్రపతి ఇండిపెండెన్స్ డే స్పీచ్: కరోనా, ఒలింపిక్స్, డెవలప్ మెంట్ గురించి ప్రస్తావన
అఖండ భారతవని మరికొన్ని గంటల్లో 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోనుంది. జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రసంగం చేశారు. కరోనా వైరస్ గురించి కోవింద్ ప్రస్తావించారు. కరోనా ముగియలేదు అని.. దానిని సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కరోనా రూల్స్ పాటించాలని కోరారు. కరోనాకు శ్రీరామ రక్ష వ్యాక్సిన్ అని స్పష్టంచేశారు. ప్రతీ ఒక్కరూ టీకా తీసుకోవాలని కోరారు. కరోనా సెకండ్ వేవ్ను దేశం సమర్థవంతంగా ఎదుర్కొందని చెప్పారు.
దేశవ్యాప్తంగా 50 కోట్లకు పైగా మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చామని తెలిపారు. ప్రతీ భారతీయుడు టీకా తీసుకోవాలని సూచించారు. ఈ కష్టకాలంలో మనకు అండగా నిలిచిన వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బందికి కోవింద్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. వైద్య సిబ్బంది వల్లే చాలా మంది ప్రాణాలను కాపాడారని పేర్కొన్నారు.
టోక్యో ఒలింపిక్స్ గురించి కోవింద్ ప్రస్తావించారు. క్రీడాకారులు దేశం గర్వపడేలా ప్రతిభ కనబరిచారని ప్రశంసించారు. పతకాలు సాధించిన క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించారు. జమ్ముకశ్మీర్లో నూతన ఒరవడి ప్రారంభం కానుందని చెప్పారు. కశ్మీర్లో కొత్త మార్పులు వస్తాయని.. ఇందులో యువత కూడా భాగస్వాములు కావాలని కోరారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతుందని.. ఇప్పటివరకు అన్నీ రంగాల్లో అభివృద్ది సాధించిందని రామ్నాథ్ కోవింద్ చెప్పారు. ఎంతోమంది మహానీయులు తమ ప్రాణాన్ని ఫణంగా పెట్టడంతో మనం స్వేచ్చ వాయువులు పీలుస్తున్నామని ఆయన వివరించారు. స్వాతంత్ర్యం వచ్చేందుకు పోరాడిన మహానీయులకు నమస్కరిస్తున్నానని అని తెలిపారు.
వ్యవసాయ మార్కెటింగ్లో తీసుకువచ్చిన పలు సంస్కరణలతో రైతులకు మరింత సాధికారత చేకూరిందని అన్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు రైతులకు మెరుగైన ధర లభిస్తుందని చెప్పారు. నైపుణ్యాలను కలిగిన చిన్నారులను, కుమార్తెలను గుర్తించి వారు ఉన్నతస్ధానాలకు చేరుకునేలా ప్రోత్సహించాలని తల్లితండ్రులకు విజ్ఞప్తి చేశారు. మన ప్రజాస్వామ్యం పార్లమెంటరీ వ్యవస్ధ పునాదులపై నిర్మించబడిందని, పార్లమెంట్ను మనం ప్రజాస్వామ్య దేవాలయంగా గుర్తెరగాలని అన్నారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా నూతన పార్లమెంట్ భవనం అందుబాటులోకి రానుండటం మన ప్రజాస్వామ్యంలో అభివృద్ధి ప్రస్ధానానికి నాంది పలుకుతుందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మన ప్రజాస్వామ్య దేవాలయం కొత్త భవనంలో కొలువుతీరడం దేశ ప్రజలకు గర్వకారణమని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు.