కరోనా వ్యాక్సిన్ పంపిణీ బ్లూ ప్రింట్ రెడీ- తొలి విడతలో 30 కోట్ల మందికి- 26 కోట్లు వారే...
దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతోంది. చలికాలం కావడంతో తిరిగి సెకండ్ వేవ్ ఉండొచ్చన్న అంచనాలూ ఉన్నాయి. వీటి మధ్యే వ్యాక్సిన్ కూడా సిద్ధమవుతోంది. మరో మూడు నెలల్లో భారత్కు ఎట్టిపరిస్దితుల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం ఖాయమని కేంద్రం చెబుతోంది. దీంతో ఆ మేరకు వ్యాక్సిన్ను ప్రజలకు అందించేందుకు శరవేగంగా ఏర్పాట్లు కూడా చేస్తోంది. దీనికి సంబంధించిన బ్లూ ప్రింట్ కూడా సిద్ధమైంది.
కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే తొలి విడతగా దాదాపు 30 కోట్ల మందికి దాన్ని అందించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఎవరెవరు ఉండబోతున్నారో కూడా ఇప్పటికే ప్రకటించింది. ఆరోగ్య కార్యకర్తలు, పోలీసులు, 50 ఏళ్లకు పైబడిన వారు, తీవ్ర సమస్యలతో బాధపడుతున్న యువతకు ముందుగా టీకా వేయాలని జాతీయ వ్యాక్సిన్ కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు బ్లూ ప్రింట్ను కూడా సిద్దం చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రాల్లో నియమించిన కమిటీలతో సమన్వయం చేసుకుంటూ ముందుగా వీరికి టీకా ఇవ్వబోతోంది.
వీకే పౌల్ నేతృత్వంలోని జాతీయ వ్యాక్సిన్ కమిటీ దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీకి కోసం అవసరమైన బ్లూ ప్లింట్ను సిద్దం చేసిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వశాఖ ముఖ్య సలహాదారు విజయ్ రాఘవన్ తెలిపారు. జాతీయ టీకా పంపిణీ కార్యక్రమంలో భాగంగా మార్చి తర్వాత కోట్లాది వ్యాక్సిన్లు అందుబాటులోకి రాబోతున్నాయని ఆయన వెల్లడించారు.
టీకాను ముందుగా కోటి మంది ఆరోగ్య కార్యకర్తలకు, మరో రెండు కోట్ల మంది కేంద్ర, రాష్ట్రాల పోలీసులు,, ఆర్మీ బలగాలు, హోం గార్డులు, పౌర రక్షణ విభాగంలో ఉన్న వారికి అందిస్తారు. ఆ తర్వాత 50 ఏళ్లు పైబడిన వారికి, గుండెజబ్బులు, డయాబెటిస్, ఇతర తీవ్రమైన రోగాలు ఉన్నవారికి అందిస్తారు. వీరే 26 కోట్లమంది వరకూ ఉంటారని అంచనా వేస్తున్నారు. చివరిగా 50 ఏళ్ల లోపు ఉన్నా అతి తీవ్ర రోగాలతో బాధపడుతున్న కోటి మందికి ఈ టీకా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.