కరోనా బారినపడి ఆస్పత్రిలో చేరిన మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య: తీవ్ర అస్వస్థత
కోల్కతా: వారం రోజుల క్రితం కరోనా బారినపడిన పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య(77) తీవ్ర అస్వస్థతో కోల్కతాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఆక్సిజన్ స్థాయి 90 శాతం కన్నా దిగువకు పడిపోవడంతో వైద్యుల సూచన మేరకు ఆయన్ను మంగళవారం ఆస్పత్రిలో చేర్చారు.
మే 18న కరోనా సోకవడంతో బుద్ధదేవ్ భట్టాచార్య తన నివాసంలోనే ఐసోలేషన్లో ఉన్నారని, ఆక్సిజన్ స్థాయి పడిపోవడంతో ఆలస్యం చేయకుండా చికిత్స అందించేందుకు ఆయనను ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు వైద్యులు వెల్లడించారు. శ్వాస సంబంధిత వ్యాధితో ఇబ్బంది పడుతున్న దృష్ట్యా ఆయన ఇతర వైద్య పరీక్షల కోసం కూడా ఆస్పత్రికి వెళ్లాల్సి ఉన్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.
కాగా, కరోనా సోకినప్పటి నుంచి ఆయన ఆస్పత్రికి వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. ఆయన భార్య మీరా భట్టాచార్య కూడా గత వారం కరోనా బారినపడి ఆస్పత్రిలో చేరారు. నెగెటివ్గా తేలడంతో ఆమెను సోమవారం డిశ్చార్జ్ చేశారు.
Former #Bengal CM Buddhadeb Bhattacharya shifted to a private hospital in #Kolkata as a measure of abundant precaution ahead of #CycloneYaas pic.twitter.com/BJZfffFBoW
— Indrajit | ইন্দ্রজিৎ - কলকাতা (@iindrojit) May 25, 2021
మరోవైపు, పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 17,005 కరోనా కేసులు నమోదు కాగా, 19,057 మంది కోలుకున్నారు. 157 మంది మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,26,376 యాక్టివ్ కేసులున్నాయి.