కరోనా విలయం:చైనాను దాటనున్న భారత్.. జూన్ 30 వరకు లాక్డౌన్ పొడగింపు.. కొద్దిగంటల్లో కీలక ప్రకటనలు..
భయపడ్డంతా జరుగుతోంది.. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన రెండో దేశంగా భారత్లో కరోనా విలయతాండవం తారాస్థాయికి చేరింది. కొవిడ్-19 కేసుల విషయంలో వైరస్ జన్మస్థలమైన చైనాను అధిగమించబోతున్నాం. గురువారం నాటికి చైనాలో మొత్తం కేసులు 82,929కాగా, భారత్ లో ఆ సంఖ్య 78,003గా ఉంది.
Recommended Video
మే2 తర్వాత నుంచి ప్రతి రోజు కనీసం మూడువేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతోన్న నేపథ్యంలో ఇంకొద్ది గంటల్లోనే మనం చైనాను దాటేసి, మోస్ట్ ఎఫెక్టెడ్ టాప్-10 జాబితాలో చేరబోతున్నాం. పీక్ దశకు చేరకముందే కేసుల తీవ్రత పెరగడంతో లాక్ డౌన్ గడువును మరింత కాలం పొడగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 30 వరకు లాక్ డౌన్ 4.0 ఉండొచ్చని, దీనిపై మరికొద్ది గంటల్లోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని ఢిల్లీ వర్గాలు పేర్కొన్నాయి.
ఇండియా వర్సెస్ చైనా
కరోనా కేసుల విషయంలో భారత్.. చైనాను అధిగమించనున్న వేళ మనం ఇంకొన్ని కీలక అంశాలను గుర్తుచేసుకోవాలి. చైనాలో మొత్తం కేసుల సంఖ్య 82,929 అయినప్పటికీ అందులో 78,195 మంది ఇప్పటికే వ్యాధి నుంచి కోలుకున్నారు. మరో 4,633 మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే ప్రస్తుతం అక్కడున్న యాక్టివ్ కేసుల సంఖ్య కేవలం 101 మాత్రమే. అదే ఇండియాలో మొత్తం కేసులు 78,003కాగా, అందులో యాక్టివ్ కేసుల సంఖ్య 50వేలకు దగ్గరగా ఉంది. అంతేకాదు, కొత్త కేసుల నమోదులోనూ భారత్ రికార్డుల్లోకి ఎక్కింది..
ప్రపంచ టాప్-5లో మనం..
మన దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్గగా 3722 కేసులు, 134 మరణాలు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం నాటి బులిటెన్ లో ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 78,003కు పెరగ్గా, అందులో 26235 మంది వ్యాధి నుంచి కోలుకోగా, 2549 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్త కేసుల విషయంలో భారత్ ప్రపంచంలోనే టాప్-5లో కొనసాగుతుండటం విచారకరం. గడిచిన 24 గంటల్లో అమెరికాలో 21,712, బ్రెజిల్ లో 11,555, రష్యాలో 10,028, పెరూలో 4,247 కొత్త కేసులు నమోదుకాగా.. 3722 కొత్త కేసులతో భారత్ ఐదో స్థానంలో నిలిచింది. మే 2 నుంచి కొనసాగుతోన్న సినారియోను బట్టి మనం మరో స్థానానికి ఎగబాకినా ఆశ్యర్యపోనక్కర్లేదని నిపుణులు అంటున్నారు. దీంతో..
ఎగ్జిట్ స్ట్రాటజీ మార్పు?
మే 17తో లాక్ డౌన్ 3.0 ముగియనుండగా, దాన్ని మరింత కాలం పొడిగించి తీరుతామని, గతానికి భిన్నంగా లాక్ డౌన్ 4.0 ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ.. ముఖ్యమంత్రుల కాన్ఫరెన్స్ లోనే స్పష్టం చేశారు. కంటైన్మెంట్ జోన్లలో కఠిన నిబంధనలు పాటిస్తూనే, నాన్ కంటైన్మెంట్ జోన్లలో వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక, రవాణా వ్యవస్థలన్నీ పున:ప్రారంభించేందుకు అంతా సిద్ధమయ్యారు. అయితే, కేసుల తీవ్రత దృష్ట్యా కేంద్రం తన స్ట్రాటజీ మార్చుకున్నట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ పొడగింపునకు సంబంధించి శుక్రవారం కేంద్రం ప్రకటన వెలువడనుడగా, ఒకరోజు ముందే రైల్వే రిజర్వేషన్లను జూన్ 30 వరకు రద్దు చేస్తూ కేంద్రం తన స్ట్రాటజీని చెప్పకనే చెప్పింది.
రాష్ట్రాలపై నెపం మోపేలా..
నిజానికి లాక్ డౌన్ ఎగ్జిట్ స్ట్రాటజీపై కేంద్ర, రాష్ట్రాల మధ్య తీవ్రమైన భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఏయే రంగాన్ని రీఓపెన్ చేయాలనే నిర్ణయాధికారాన్ని రాష్ట్రాలకే వదిలికి పెట్టాలని మెజార్టీ సీఎంలు డిమాండ్ చేశారు. అందుకు సూత్రప్రాయంగా సరేనన్న ప్రధాని మోదీ.. మే 15లోగా సీఎంలు తమ డిమాండ్ల చిట్టాను పంపాలని సూచించారు. అవే అంశాలను లాక్ డౌన్ 4.0కు సంబంధించిన మార్గదర్శకాల్లో వెల్లడించే అవకాశముంది. అంటే, కేంద్రం తనకు తానుగా స్ట్రిక్ట్ రూల్స్ జారీ చేసి.. స్థానిక అవసరాలకు తగ్గట్లు ఆయా రాష్ట్రాలు వాటిని సవరించుకోవచ్చనే సూచన చేసే అవకాశముందని, తద్వారా రాబోయే రోజుల్లో కేసులు పెరిగితే, ఆ నెపాన్ని రాష్ట్రాలపైనే మోపేందుకు రంగం సిద్ధమవుతోందని ప్రతిపక్ష పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
జూన్ 30 దాకా తప్పదంతే..
కరోనాతో కలిసి జీవించక తప్పదనే అభిప్రాయం సర్వత్రా వెలువడుతున్నప్పటికీ.. ఆ మేరకు వైద్య రంగాన్ని సన్నధ్దం చేయడంలో మాత్రం అన్ని దేశాలూ విఫలమవుతున్నాయి. భారత్ లో జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడగింస్తారనే వార్తలు వస్తున్న సమయంలోనే.. అమెరికా, బ్రిటన్ ప్రభుత్వాలు అదే తరహా నిర్ణయాలు తీసేసుకోవడం గమనార్హం. అమెరికాలో కేసుల సంఖ్య 14.30లక్షలకు చేరగా, మరణాల సంఖ్య 85 వేల దాటింది. మోస్ట్ ఎఫెక్డెడ్ గా ఉన్న న్యూయార్క్ ను జూన్ 30 వరకు మూసేస్తున్నట్లు మేయర్ అధికారికంగా ప్రకటించారు. బ్రిటన్ లోనూ కేసులు 2.30 లక్షలకు, మరణాలు 33,156కు పెరగడంతో దేశవ్యాప్తంగా జూన్ 30 వరకు షట్ డౌన్ కొనసాగించాలని ప్రధాని బోరిస్ జాన్సన్ నిర్ణయించారు. అటు చైనాలోనూ గురువారం కొత్తగా 15 కేసులు నమోదుకావడంతో జిలిన్ ఫ్రావిన్స్ ను మళ్లీ లాక్ డౌన్ చేసేశారు. కరోనా తీవ్రతను అంచనా వేయడంలో బొక్కబోర్లా పడ్డ దేశాలన్నీ మళ్లీ లాక్ డౌన్ ప్రకటిస్తున్నవేళ.. భారత్ లో లాక్ డౌన్ 4.0ను సడలింపులతో కాకుండా, మరింత కఠినంగా అమలుచేయాలని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు.