Coronavirus: కోవిడ్ -19 ల్యాబ్ లో కలకలం, డాక్టర్లు, నర్సులకు పాజిటివ్, 55 వేల మందికి పరీక్షలు !
బెంగళూరు: భారతదేశంలో కరోనా వైరస్ (COVID 19) రోగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది. ఎవరెవరికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది ?, నెగటివ్ ఎవరికి వచ్చింది? అంటూ ఆ వ్యాధి లక్షణాలను గుర్తించే పనిలో ప్రతిరోజు 24 గంటలు COVID-19 ల్యాబ్ సిబ్బంది బిజీబిజీగా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు 55, 245 మందికి కరోనా వైద్యపరీక్షలు నిర్వహించిన కోవిడ్ 19 ల్యాబ్ క్యాంపస్ లో సుమారు 30 మందికి కరోనా వైరస్ వ్యాధి సోకడంతో ప్రభుత్వ వైద్య సిబ్బంది హడలిపోయారు. ఒక్క దెబ్బతో ఎన్ఐవీ ల్యాబ్ ను క్లోజ్ చేశారు. కోవిడ్ -19 పరీక్షా కేంద్రాన్ని పూర్తిగా శానిటైజ్ చేసిన అధికారులు వారం రోజుల పాటు అత్యవసర సేవలు మినహాయించి అన్ని వైద్య సేవలు బంద్ చేశారు.

బెంగళూరులో ఎన్ఐవీ ల్యాబ్
బెంగళూరు నగరంలో రానురాను ప్రతిరోజు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. బెంగళూరు నగరంలోని జయనగర్ లోని కిద్వాయ్ ఆసుపత్రి ఆవరణంలో నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ వైరాలజీ సంస్థ (ఎన్ఐవీ)లో ప్రభుత్వం కోవిడ్- 19 పరీక్షా కేంద్రం (ల్యాబ్) ఏర్పాటు చేశారు. ప్రతిరోజు బెంగళూరు నగరంతో సహ కర్ణాటకలోని అనేక జిల్లాలకు చెందిన కరోనా వ్యాధి లక్షణాలు ఉన్న అనుమానితులకు ఈ ల్యాబ్ లో వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు.

ప్రతిరోజు కనీసం 1, 000 మందికి పరీక్షలు
జయనగరలోని కిద్వాయ్ ఆసుపత్రి ఆవరణంలోని కోవిడ్- 19 పరీక్షా కేంద్రంలో ప్రతిరోజు కనీసం వెయ్యి మందికి పైగా కరోనా వైరస్ వ్యాధి వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఎంత మందికి కరోనా వైరస్ సోకింది ? నెగటివ్ ఎవరికి వచ్చింది ? అని అక్కడి ల్యాబ్ సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

55 వేల మందికి కరోనా పరీక్షలు చేస్తే ?
ఎన్ఐవీ క్యాంపస్ ఆవరణంలలోని ఈ కోవిడ్- 19 ల్యాబ్ లో ఇప్పటి వరకు 55, 245 మందికి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు. అందులో ఎంత మందికి కరోనా పాజిటివ్ వచ్చింది, ఎంత మందికి కరోనా నెగటివ్ వచ్చింది ? అని అక్కడి సిబ్బంది తేల్చి చెప్పారు. అయితే కరోనా వైరస్ పరీక్షలు చేసిన ల్యాబ్ సిబ్బందికి ఆ వ్యాధి తగులుకుంటుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు.

డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ సిబ్బంది హడల్
కిద్వాయ్ ఆసుపత్రిలోని ఈ ల్యాబ్ ఆవరణంలో ఇప్పటి వరకు 12 మంది క్యాన్సర్ రోగులకు, 10 మంది వైద్య సిబ్బందికి, డాక్టర్లుకు, నర్సులకు కరోనా వైరస్ వ్యాధి సోకిందని, వారికి కరోనా పాజిటివ్ అని అక్కడి ల్యాబ్ లోనే వెలుగు చూడటంతో కిద్వాయ్ ఆసుపత్రి వర్గాలతో పాటు అక్కడి అధికారులు, సిబ్బంది హడలిపోయారు.

కోవిడ్ -19 ల్యాబ్ బంద్
ఎన్ఐవీ ల్యాబ్ సిబ్బంది కరోనా సోకిన దెబ్బకు 7 రోజుల పాటు అత్యవసర సేవలు మినహాయించి అన్ని వైద్య సేవలు నిలిపివేశామని, ఆసుపత్రిలో కరోనా వైరస్ సోకిన డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బందిని క్వారంటైన్ కు తరలించామని వైద్య శాఖ అధికారులు తెలిపారు. మొత్తం మీద కోవిడ్ -19 ల్యాబ్ సిబ్బందికే కరోనా వైరస్ పాజిటివ్ అని వెలుగు చూడటంతో బెంగళూరు ప్రజలతో పాటు వైద్య శాఖ అధికారులు హడలిపోయారు. 7 రోజుల పాటు పూర్తిగా కోవిడ్-19 ల్యాబ్ ను మూసివేశామని అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications