విషాదం... ఆస్పత్రి పైనుంచి దూకి కరోనా పేషెంట్ ఆత్మహత్య...
పశ్చిమ గోదావరిలో విషాదం చోటు చేసుకుంది. ఏలూరులోని ఆశ్రం ఆస్పత్రి పైనుంచి దూకి ఓ కరోనా పేషెంట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొద్దిరోజులుగా అతని మానసిక స్థితి కూడా బాగా లేనట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళ్తే... నిడదవోలుకు చెందిన కోలా రాంబాబు(32) ఇటీవల కరోనా బారినపడి చికిత్స కోసం ఏలూరు ఆశ్రం ఆస్పత్రిలో చేరాడు. మొదట్లో బాగానే ఉన్నప్పటికీ... గత మూడు రోజులుగా 'నేను దేవుడి వద్దకు వెళ్లిపోతా' అని పదేపదే అందరితో చెప్తున్నాడు. అతని మానసిక స్థితి బాగాలేకపోవడంతో అతన్ని చూసుకునేందుకు కుటుంబ సభ్యుల్లో ఒకరికి అనుమతినిచ్చారు.

ఈ క్రమంలో శనివారం ఉదయం ఆస్పత్రి మూడో అంతస్తు నుంచి దూకి అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్య సమయంలోనూ... 'బై బై... నేను దేవుడి వద్దకు పోతున్నా..' అంటూ అరిచాడని ఆస్పత్రి సిబ్బంది చెప్పారు. ఆ సమయంలో అతని కుటుంబ సభ్యులు కూడా ఆస్పత్రి ప్రాంగణంలోనే ఉన్నట్లు తెలుస్తోంది.
కరోనా నుంచి కోలుకుని ఇక రేపో మాపో డిశ్చార్జి అవుతాడని ఎదురుచూస్తున్న తరుణంలో రాంబాబు ఆత్మహత్యకు పాల్పడ్డాడని అతని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
గతంలోనూ కొంతమంది కరోనా పేషెంట్లు ఇలాగే ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ నెల 14న గుంటూరులోని ఎన్నారై ఆస్పత్రిలో ఓ కరోనా పేషెంట్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు యత్నించాడు. అంతకుముందు,ఒంగోలు జీజీహెచ్ ఆస్పత్రిలోనూ రాధాకృష్ణా రెడ్డి అనే ఓ వ్యక్తి భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కరోనా లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు.












Click it and Unblock the Notifications