షాకింగ్:భారత్లో 198 రకాల కరోనాలు.. వైరస్ వ్యాప్తిపై జెడ్ఎస్ఐ అధ్యయనంలో కీలక అంశాలు..
ప్రపంచవ్యాప్తంగా కరోనా కాటుకు గురైనవాళ్ల సంఖ్య 65లక్షలకు పెరిగింది. మరణాలు 4 లక్షలకు చేరువయ్యాయి. ప్రతిరోజూ కనీసం 8వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతుండటంతో ప్రపంచ పట్టికలో భారత్ ఏడో స్థానానికి చేరింది. బుధవారం నాటికి మన దగ్గర మొత్తం కేసుల సంఖ్య 2.15లక్షలుకాగా, మరణాల సంఖ్య 6వేలు దాటింది. రాబోయే రోజులు మరింత ఘోరంగా ఉంటాయన్న హెచ్చరికలకుతోడు తాజాగా 'జువాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జెడ్ఎస్ఐ)' వెల్లడించిన సంచలన అంశాలు కలకలం రేపుతున్నాయి.
Recommended Video
198 రకాలు..
భారత్లో మొత్తం 198 రకాల కరోనా వైరస్లను(వేరియంట్లు) గుర్తించామని జువాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా బుధవారం ప్రకటించింది. కాగా, ఇక్కడ వ్యాప్తిస్తోన్న వైరస్ లు.. చైనా, యూరప్ దేశాల్లో కనిపించినవే ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. ప్రధానంగా కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న ఢిల్లీ, గుజరాత్, తెలంగాణా, మహారాష్ట్ర, కర్నాటకలో ఎక్కువ వేరియంట్లు వ్యాప్తిలో ఉన్నాయని చెప్పింది.
జన్యుక్రమాల ఆధారంగా..
దేశ వ్యప్తంగా కరోనాకు సంబంధించి 400 జన్యుక్రమాలను పరిశీలించి, 198 వేరియంట్లను గుర్తించినట్లు జువాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ కైలాష్ చంద్ర మీడియాకు తెలిపారు. అంటే, కరోనా వైరస్ భారత్లోకి అడుగుపెట్టే ముందే కనీసం 200 సార్లు ఉత్పరివర్తనం(మ్యూటేట్) చెంది ఉండొచ్చని, జీఐఎస్ఏఐడీ గ్లోబల్ డేటాబేస్లో నమోదైన జన్యుక్రమాల్లో భారత్కు చెందినవి 550గా ఉన్నాయని ఆయన చెప్పారు. ఐరోపాకు సంబంధించి తొలి వేరియంట్ ఇటలీ నుంచే భారత్లో అడుగుపెట్టినప్పటికీ ఆ తరువాత ఇతర ఐరోపా దేశాల నుంచి కూడా వివిధ రకాల వైరస్ ఇక్కడకు వచ్చాయన్నారు. ఇరాన్, దుబాయ్ దేశాల్లో కనిపించే రకం మాత్రం తక్కువ సంఖ్యలో వ్యాప్తి చెందిందని తెలిపారు.
రాష్ట్రాల వారీగా...
రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే.. గుజరాత్లో అత్యధికంగా 60 వైరస్ రకాలు వ్యాప్తిలో ఉన్నాయని తెలిపారు. ఢిల్లీలో 39, తెలంగాణాలో 55, మహారాష్ట్ర, కర్ణాటకల్లో చెరో 15 గుర్తించామని అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్తలు చెప్పారు. ఈశాన్య రాష్ట్రల్లో అతి తక్కువ వైరస్ వేరియంట్లు వ్యాప్తిలో ఉన్నాయన్నారు. జూవాలాజిక్ సర్వే ఆఫ్ ఇండియా వారు గుర్తించిన దాదాపు 200 వేరియంట్లలో డీ614జీ అనే రకం బాగా వ్యాప్తిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఉత్పరివర్తనం ప్రభావం వైరస్ వ్యాప్తిపై ఏమేరకు ఉంది, వ్యాధి కలిగించే శక్తిలో ఏమైనా మార్పులు వచ్చాయా లేదా అని తెలియాలంటే మరింత పరిశోధన జరగాల్సి ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.