Disha Murder case: వారిని ఉరి తీయడానికి రెడీగా ఉన్నా: ఆ పని అప్పుడే చేయాల్సింది: తలారి పవన్
లక్నో: నిర్భయ హత్యకేసులో దోషులను ఉరి తీయడానికి తీహార్ జైలులో తలారి అందుబాటులో లేరంటూ వచ్చిన వార్తలు దిగ్భ్రాంతికి గురి చేశాయి. తలారి అందుబాటులో లేకపోవడం వల్లే ఉరి శిక్షను అమలు చేయడంలో తీవ్ర జాప్యం నెలకొందనే వార్తలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అదే సమయంలో- ఆ వార్తలను తోసిపుచ్చారు తలారి పవన్. నిర్భయ హంతకులను ఉరి తీయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. జైలు అధికారులు ఎప్పుడు రమ్మంటే అప్పుడు ఢిల్లీ వెళ్లడానికి తయారుగా ఉన్నానని చెప్పారు.

కుటుంబ వృత్తిగా.. ఉరితీత
ప్రస్తుతం దేశం మొత్తం మీద అందుబాటులో ఉన్న ఒకే ఒక్క తలారి.. పవన్. ప్రస్తుతం ఆయన తన కుటంబంతో కలిసి ఉత్తర్ ప్రదేశ్ లోని లక్నోలో నివాసం ఉంటున్నారు. ఆయన ముత్తాత, తాత, తండ్రి కూడా తలారి వృత్తిలో కొనసాగిన వారే. తలారి వృత్తిలో ప్రస్తుతం పవన్ ది నాలుగో తరం. ఆయన ముత్తాత లక్ష్మణ్ జల్లద్, తాత కాలూరామ్ జల్లద్, తండ్రి మమ్ము జల్లద్.. ఇదే వృత్తిని కొనసాగించారు. ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఆయన కుటుంబానికి ప్రతినెలా సుమారు 25 వేల రూపాయల గౌరవ వేతనాన్ని చెల్లిస్తోంది.

నిర్భయ హంతకులను ఉరి తీయడానికి..
ప్రస్తుతం తాను నిర్భయ హంతకులను ఉరి తీయడానికి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నానని పవన్ అన్నారు. బుధవారం ఆయన ఓ మీడియా ఏజెన్సీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. దీనికోసం ఉరి తాళ్లను కూడా సిద్ధం చేసుకుని, భద్ర పరిచానని చెప్పారు. నిర్భయ హత్యకేసులో దోషులను ఉరి తీయడంలో ఏడేళ్ల పాటు జాప్యం చోటు చేసుకోవడం అవాంఛనీయమని పవన్ అభిప్రాయపడ్డారు. ఆ జాప్యం దేశవ్యాప్తంగా ప్రభావితం చేస్తోందని అన్నారు.

అప్పుడే ఉరి తీసి ఉంటే.. దిశ ఉదంతం ఉండేది కాదు..
నిర్భయ కేసులోొ దోషులను ఏ మాత్రం ఉపేక్షించకుండా తీర్పు వచ్చిన వెంటనే ఉరి తీసి ఉంటే బాగుండేదని తలారి చెప్పారు. హైదరాబాద్ లో వెటర్నరి డాక్టర్ దిశ హత్యోదంతం తలెత్తేది కాదని అభిప్రాయపడుతున్నానని అన్నారు. నిర్భయ, డాక్టర్ దిశ వంటి దారుణ ఘాతుకాలకు పాల్పడిన వారి విషయంలో సత్వర న్యాయం అందించాల్సిన అవసరం ఉందని, దోషులకు ఉరి శిక్ష పడితే,.. జాప్యం చేయకుండా దాన్ని అమలు చేయాల్సి ఉంటుందని అన్నారు.

దిశ హత్యోదంతంలో కూడా అదే తరహా తీర్పు..
2012 డిసెంబర్ 16వ తేదీన దేశ రాజధానిలో చోటు చేసుకున్న నిర్బయ ఉదంతానికి, హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ వద్ద జరిగిన డాక్టర్ దిశ కేసు మధ్య చాలా దగ్గరి పోలీకలు ఉన్నాయని పవన్ అన్నారు. ఈ రెండు కేసులు కూడా హతుల కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపాయని, వారి గురించి తలచుకుంటే గుండె బాధతో బరువెక్కుతోందని చెప్పారు. నిర్భయ కేసు తరహాలోనే డాక్టర్ దిశ ఉదంతంలో కూడా తీర్పు వెలువడాలని తాను ఆశిస్తున్నట్లు తలారి పవన్ కోరుకున్నారు.












Click it and Unblock the Notifications