ట్వీట్ చేస్తే చాలు: ఆకతాయిల నుంచి కాపాడిన కేంద్రమంత్రి
న్యూఢిల్లీ: కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు తనకు వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తనకు ఏ ఫిర్యాదు అందినా.. క్షణాల్లో పరిష్కారమవ్వాల్సిందేనన్నట్లు ఆయన పని ఉంటోంది.
తమకు సమస్య ఉందని ఎవరైనా మంత్రి దృష్టి తీసుకెళ్తే.. వెంటనే దాన్ని పరిష్కరించేస్తారు. ఈ నేపథ్యంలోనే సురేష్ ప్రభు పనితీరు అద్భుతమంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా సమస్యలపై ఆయన క్షణాల్లో స్పందించిన విధానం పట్ల దేశ వ్యాప్తంగా అంతా ముగ్ధులవుతున్నారు.

తాజాగా ఆయన ఓ ఆకతాయి గుంపు నుంచి దంపతులను రక్షించి శభాష్ అనిపించుకున్నారు. రాజస్థాన్ లోని అజ్మీర్ నుంచి అజ్మేరీ షరీఫ్-సెల్దాహ్ ఎక్స్ప్రెస్లో ఓ దంపతులు ప్రయాణిస్తున్నారు. వారు ఎక్కిన బోగీలోనే 20మంది వరకు యువకులు కూడా కూర్చున్నారు.
అయితే, వారందరూ కలిసి ఆ దంపతులను వేధించడం మొదలు పెట్టారు. దీంతో ఆ దంపతులు కాన్పూర్, ఆగ్రా రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు పట్టించుకోలేదు. దీంతో ఆ దంపతులు రైల్వే మంత్రికి ట్విట్టర్లో ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో రైలు ధన్ బాద్ స్టేషన్కు రాగానే పోలీసులు వచ్చి ఆ దంపతులను వేధిస్తున్న ఐదుగురు ఆకతాయిలను అదుపులోకి తీసుకున్నారు. కాగా, మిగిలినవారు పరారయ్యారు. దీంతో ఆ దంపతులు తమకు సాయం చేసిన రైల్వే మంత్రి సురేష్ ప్రభుకి ధన్యవాదాలు తెలిపారు. గతంలో కూడా ప్రయాణికులు ట్విట్టర్ ద్వారా తమ సమస్యలను చెబితే మంత్రి వేగంగా స్పందించిన ఘటనలు చాలానే ఉన్నాయి.












Click it and Unblock the Notifications