కోల్ స్కామ్: మన్మోహన్కు కోర్టు షాక్, అమాయకుడని రేణుకా చౌదరి
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం కేసులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు ప్రత్యేక కోర్టు షాక్ ఇచ్చింది. మన్మోహన్ సింగ్ వాంగ్మూలాన్ని నమోదు చేయాలని ప్రత్యేక కోర్టు కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ)ని ఆదేశించింది. మాజీ కోల్ సెక్రటరీ పిసి పరేఖ్, పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లాలకు పాత్ర ఉందన్న నేపథ్యంలో బొగ్గు కుంభకోణంపై మరింత దర్యాప్తు సాగించాలని కూడా కోర్టు సిబిఐని ఆదేశించింది.
అప్పటి బొగ్గు శాఖ మంత్రి (మన్మోహన్ సింగ్) వాంగ్మూలాలను తాను కోరుకుంటున్నట్లు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సిబిఐతో అన్నారు. తదుపరి దర్యాప్తుపై వచ్చే ఏడాది జనవరి 27వ తేదీ లోగా స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని కూడా ఆదేశించారు. హిందాల్కోకు 2005లో ఒడిషాలోని రెండు, మూడు తలబిరా బొగ్గు క్షేత్రాలను కేటాయించడంపై పరేఖ్, కుమార మంగళం బిర్లాలపై అభియోగాలు మోపుతూ సిబిఐ ఎఐఆర్ నమోదు చేసింది.
నవంబర్ 25వ తేదీన జరిగిన విచారణ సందర్భంగా కోర్టు సిబిఐకి తీవ్రమైన ప్రశ్నలు వేసింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ను ఎందుకు ప్రశ్నించలేదని అడిగింది. బొగ్గు శాఖను 2005, 2009 మధ్య ఆయనే నిర్వహించారు.
మన్మోహన్ సింగ్ను విచారించడం అవసరమని తొలుత భావించామని, అయితే ఆ తర్వాత అవసరం లేదనిపించిందని సిబిఐ చెప్పిన నేపధథ్యంలో కోర్టు ఆ విషయంపై ప్రతిస్పందించింది.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అమాయకుడని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి తెలిపారు. మంగళవారం న్యూఢిల్లీలో రేణుకాచౌదరి మాట్లాడారు. బొగ్గు కుంభకోణంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రమేయం లేదని భావిస్తున్నట్లు చెప్పారు.