డెల్టా ప్లస్ వేరియంట్పైనా కోవాగ్జిన్ సమర్థంగా పనిచేస్తోంది: ఐసీఎంఆర్ అధ్యయనంలో వెల్లడి
న్యూఢిల్లీ: హైదరాబాద్కు చెందిన ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనావైరస్ వ్యాక్సిన్ కోవాగ్జిన్ సామర్థ్యానికి సంబంధించిన మరో కీలక విషయం వెల్లడైంది. కోవాగ్జిన్ టీకా డెల్టా ప్లస్ వేరియంట్పై సమర్థంగా పనిచేస్తోందని తేలింది. దేశంలో కరోనా వ్యాప్తి, వ్యాక్సిన్ల పనితీరుపై భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) తాజా అధ్యయనంలో ఈ మేరకు వెల్లడైంది.
దేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ ఉధృతికి కారణంగా భావిస్తోన్న డెల్టా వేరియంట్ నుంచి కోవాగ్జిన్ టీకా మెరుగైన రక్షణ కల్పిస్తోంది. దీంతోపాటు డెల్టా ప్లస్ వేరియంట్ను కూడా ఈ వ్యాక్సిన్ సమర్థంగా ఎదుర్కొంటున్నట్లు తాజా అధ్యయనంలో తేలిందని ఐసీఎంఆర్ తెలిపింది.
కాగా, ఐసీఎంఆర్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్ఐవీ) సహకారంతో భారత్ బయోటెక్ సంస్త కోవాగ్జిన్ టీకాను అభివృద్ది చేసిన విషయం తెలిసిందే. కరోనా అడ్డుకోవడంలో ఈ టీకాకు 77.8 శాతం సమర్థత ఉన్నట్లు ఇటీవల మూడో దశ క్లినికల్ పరీక్షల తుది విశ్లేషణలో నిర్ధారణైంది.
కోవాగ్జిన్ టీకా తీసుకుంటే ప్రాణాంతక కరోనావైరస్ డెల్టా వేరియంట్ నుంచి 65.2 శాతం రక్షణ ఉంటుందని వెల్లడైంది. తీవ్రమైన కరోనా రాకుండా 93.4 శాతం మేరకు నిరోధిస్తుందని, వ్యాధి సోకినప్పటికీ ఆస్పత్రిలో చేరే అవసరాన్ని తగ్గిస్తుందని తేలింది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారు వైరస్ సోకినప్పటికీ.. మరణించే అవకాశం దాదాపు ఉండదని పేర్కొంది. కోవిషీల్డ్ తోపాటు కోవాగ్జిన్ వ్యాక్సిన్లనను మనదేశంలో పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే.
ఇది ఇలావుండగా, దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల వ్యవధిలో 14,28,984 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 40,134 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఒక్క కేరళలోనే 20వేల మందికిపైగా కరోనా బారినపడ్డారు. ఆదివారం దేశంలో 422 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 3.16 కోట్లకు చేరగా, 4.24 లక్షల మంది కరోనా బారినపడి మరణించారు. ప్రస్తుతం దేశంలో 4,13,718 యాక్టివ్ కేసులున్నాయి. పాజిటివిటీ రేటు 1.30 శాతంగా ఉంది. రికవరీ రేటు 97.36 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశంలో 47.22 కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు.