ప్రభుత్వాలకు, ప్రైవేటు ఆస్పత్రులకు వేర్వేరుగా: కోవాగ్జిన్ టీకా ధరలు ప్రకటించిన భారత్ బయోటెక్
హైదరాబాద్: నగరానికి చెందిన ప్రముఖ వ్యాక్సిన్ తయారీ సంస్థ బారత్ బయోటెక్ కరోనా కట్టడి కోసం అభివృద్ధి చేసిన 'కోవాగ్జిన్' టీకా ధరలను తాజాగా ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు ఆస్పత్రులకు వేర్వేరు ధరలు నిర్ణయించింది.
రాష్ట్ర ప్రభుత్వాలకు అందించే టీకాకు ఒక్కో డోసు ధర రూ. 600లు కాగా, ప్రైవేటు ఆస్పత్రులకు సరఫరా చేసే వ్యాక్సిన్ డోసు ధరను రూ. 1200లుగా నిర్ణయించింది. ఈ మేరకు శనివారం రాత్రి భారత్ బయోటెక్ ఓ ప్రకటన జారీ చేసింది. ట్విట్టర్ వేదికగా పంచుకుంది.

విదేశాలకు ఎగుమతి చేసే టీకా ధర 15 నుంచి 20 డాలర్లు మధ్య ఉంటుందని సంస్థ తెలిపింది. కరోనాను నివారించడంలో కోవాగ్జిన్ టీకా సమర్థంగా పనిచేస్తున్నట్లు భారత్ బయోటెక్ సంస్థ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
Bharat Biotech - COVAXIN® Announcement pic.twitter.com/cKvmFPfKlr
— BharatBiotech (@BharatBiotech) April 24, 2021
మూడో దశ క్లినికల్ పరీక్షల రెండో మధ్యంతర ఫలితాలను బుధవారం వెల్లడించింది. కోవాగ్జిన్ టీకా తేలికపాటి, మధ్య స్థాయి, తీవ్రమైన కరోనా వ్యాధిపై 78 శాతం సమర్థవంతంగా పనిచేసిందని తెలిపింది. ఈ టీకా తీసుకుంటే తీవ్రమైన కరోనా వ్యాధితో ఆస్పత్రి పాలయ్యే అవకాశాలు నూరు శాతం ఉండవని భారత్ బయోటెక్ సంస్థ వెల్లడించింది.
కోవాగ్జిన్ టీకాను ఇప్పటికే మనదేశంలో వినియోగిస్తున్న విషయం తెలిసిందే. కోవాగ్జిన్ తోపాటు కోవిషీల్డ్ టీకాను మనదేశంలో వినియోగిస్తున్నారు. తొలి, రెండో దశలు ముగుస్తుండగా, మే 1 నుంచి మూడో దశ వ్యాక్సినేషన్ కార్యక్రమం దేశంలో ప్రారంభం కానుంది. 18 ఏళ్లు దాటిన వారందరికీ మే 1 నుంచి కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది.












Click it and Unblock the Notifications