విశాఖ గ్యాస్ లీకేజీ- బాధితులకు కరోనా భయాలు- భోపాల్ నుంచి తాజా నివేదికలే కారణం ?
విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో 12 మంది చనిపోగా... వందల సంఖ్యలో జనం తీవ్ర అనారోగ్యం పాలై వివిధ ఆస్పత్రుల్లో కోలుకుంటున్నారు. అయితే వీరికి తాజాగా మరో భయం మొదలైంది. 1984 నాటి భోపాల్ గ్యాస్ విషాదం నుంచి కోలుకున్న బాధితుల్లో 17 మంది తాజాగా కరోనా వైరస్ బారిన పడి చనిపోయినట్లు నివేదికలు వస్తుండటం వారిలో కలవరం రేపుతోంది. గ్యాస్ లీక్ తో పాటు కరోనా కూడా ఊపిరితిత్తులపై ప్రభావం చూపే అవకాశం ఉండటమే దీనికి కారణం...]
గ్యాస్ లీక్ బాధితులకు కరోనా భయం ?
విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటన వేలాది మందిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావం చూపింది. దాదాపు రెండు కిలోమీటర్ల మేర వ్యాపించిన గ్యాస్ పీల్చిన వందలాది మంది ఆస్పత్రుల్లో కోలుకుంటుండగా... మరికొంత మంది చికిత్స తీసుకుని ఇళ్లకు పయనమవుతున్నారు. కానీ ఇప్పుడు వీరిలో మరో భయం మొదలైంది. విశాఖలో కరోనా ప్రభావం ఉండటంతో ఎక్కడ వైరస్ బారిన పడతామో అని వీరంతా ఆందోళన చెందుతున్నారు. భోపాల్ నుంచి వెలువడుతున్న తాజా నివేదికలే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
భోపాల్ లో ఏం జరిగింది ?
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని యూనియన్ కార్బైడ్ ప్లాంట్లో 1984లో మిథైల్ ఐసో సైనేట్ గ్యాస్ లీక్ కావడంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది బాధితులుగా మిగిలిపోయారు. ఏళ్లు గడుస్తున్న వారిపై గ్యాస్ ప్రభావం అలాగే ఉంది. తాజాగా వీరిలో కొంత మందికి కరోనా వైరస్ సోకింది. దీంతో వీరిలో 17 మంది చనిపోయారు. వీరిలో నలుగురు ఆస్పత్రులకు రాకముందే ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మంది ఆస్పత్రిలో చేరిన 24 గంటల్లో చనిపోగా... మరో ఐదుగురు 48 గంటల తర్వాత ప్రాణాలు విడిచారు. వీరంతా భోపాల్ లోని యూనియన్ కార్బైడ్ ప్లాంట్ కు నాలుగు కిలోమీటర్ల దూరంలో నివసిస్తున్న వారే.
ఐసీఎంఆర్ నివేదిక కోరిన మధ్యప్రదేశ్...
భోపాల్ లో తాజాగా కరోనా వైరస్ బారిన పడి చనిపోయిన 1984 నాటి గ్యాస్ లీక్ బాధితుల వ్యవహారాన్ని అక్కడి ప్రభుత్వం సీరియస్ గా పరిగణిస్తోంది. వీరంతా కోమార్బిడిటీస్ అనే న్యూనతతో బాధపడ్డారని తెలుసుకున్న ప్రభుత్వం.. దీనిపై మరింత పరిశోధన జరిపి వివరాలు అందిస్తే ఇలాంటి వారు ఇంకెంత మంది ఉన్నారో గుర్తించి ప్రత్యేక చికిత్స అందిస్తామని చెబుతోంది. అంతే కాదు అప్పటి గ్యాస్ బాధితులలో ఎవరైనా కరోనా బారిన పడ్డారేమో తెలుసుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.
Recommended Video
భోపాల్ అనుభవాలతో విశాఖలో భయాలు...
భోపాల్ లో తాజాగా 17మంది గ్యాస్ లీక్ బాధితులు కరోనాతో చనిపోయిన నేపథ్యంలో తమకు కూడా ఎక్కడ కరోనా సోకుకుందో అని విశాఖ వాసుల్లోనూ భయాలు మొదలయ్యాయి. ముఖ్యంగా నిన్నటి గ్యాస్ లీక్ ఘటనలో బాధితులుగా మారిన వారిలో ఈ భయాలు ఎక్కువవుతున్నాయి. ప్రస్తుతం వీరిని పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నప్పటికీ పరిస్ధితిలో తేడా వస్తే మాత్రం వెంటనే కోవిడ్ 19 ఆస్పత్రులకు తరలించేందుకు ప్రభుత్వం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.