కొవిడ్-19: HQC కంటే ‘రెమ్డెసివిర్’ బెటర్.. ఇండియా ‘పీక్’ దశకు రాలేదు.. కేంద్రం కీలక ప్రకటన
కరోనా మహమ్మారి విజృంభణ ఇంకా తగ్గలేదు. సోమవారం సాయంత్రానికి ప్రపంచ వ్యాప్తంగా కేసుల సంఖ్య 19 లక్షలకు చేరువైంది. అందులో 4.34లక్షల మంది కొవిడ్ వ్యాధి నుంచి కోలుకోగా, 1.16లక్షల మంది చనిపోయారు. మనదేశంలోనూ వైరస్ వేగంగా విస్తరిస్తున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,057 కేసులు, 51 మరణాలు సంభవించాయి. మొత్తంగా మన దగ్గర కొవిడ్-19 కేసుల సంఖ్య 9,352కాగా, అందులో 979 మందికి వ్యాధి నయమైపోయింది. చనిపోయినవాళ్ల సంఖ్య 324కు పెరిగింది. కేంద్ర ఆరోగ్య శాఖ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్), కేంద్ర హోం శాఖ అధికారులు రోజువారీ ప్రెస్ బ్రీఫింగ్ లో భాగంగా మనకు సంబంధించిన లెక్కల్ని సోమవారం వెల్లడించారు.
జాబితాలో కొత్తగూడెం..
తొలి దశలో కొవిడ్-19 కేసులు నమోదైన (15 రాష్ట్రాల్లోని)25 జిల్లాల్లో వైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చిందని, ఆ జిల్లాల్లో గత 14 రోజుల్లో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడమే ఇందుకు నిదర్శనమని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ కమిషనర్ లవ్ అగర్వాల్ చెప్పారు. ఆ జిల్లాల జాబితాలో తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఒకటిగా ఉంది. ఇప్పటిదాకా రెండు లక్షలకుపైగా శాంపిల్స్ ను టెస్టు చేశామని, మరో ఆరువారాలకు సరిపడా టెస్టింగ్ కిట్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. లాక్ డౌన్ ను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు అన్ని రాష్ట్రాలు నిరంతరంగా పనిచేస్తున్నాయని, కేంద్ర సర్వీసుల రిటైర్డ్ సిబ్బంది, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ తదితర విభాగాలు కూడా స్థానిక పోలీసులకు సాయం చేస్తున్నాయని కేంద్ర హోం శాఖ వెల్లడించింది.
పీక్ రాలేదు.. ప్రయోగాల జోరు..
కరోనా వైరస్ వ్యాప్తిలో మనదేశం ఇంకా ‘పీక్' దశకు రాలేదని, పరిస్థితి అక్కడిదాకా వెళ్లకుండా ఉంచేందుకే అందరం కృషి చేస్తున్నామని, వ్యాప్తిని నియంత్రించడంతోపాటు కొవిడ్-19 వ్యాధికి వ్యాక్సిన్ కనిపెట్టే ప్రయత్నాలను కూడా కేంద్రం ముమ్మరం చేసిందని అగర్వాల్ చెప్పారు. కేంద్ర ఆరోగ్య శాఖ, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(సీఎస్ఐఆర్) ఆధ్వర్యంలోని బృందాలు 38 ల్యాబ్స్ లో కొత్త డ్రగ్ కనిపెట్టే ప్రయత్నాలతోపాటు అందుబాటులో ఉన్న మందులతో కొవిడ్-19 చికిత్సకు ఉత్తమమైన మార్గాలను పరిశోధిస్తున్నాయని తెలిపారు.
‘రెమ్డెసివిర్’ బాగా పనిచేస్తోంది..
ఐసీఎంఆర్ హెడ్ సైంటిస్ట్ రమణ్.ఆర్.గంగాఖేదార్ మాట్లాడుతూ.. కొవిడ్-19 చికిత్సలో ‘రెమ్డెసివిర్' డ్రగ్ బాగా పనిచేస్తున్నదని చెప్పారు. పరిస్థితి విషమించి, వెంటిలేటర్ దాకా వెళ్లిన రోగులకు రెమ్డెసివిర్ అందించగా, 68 శాతం మంది కోలుకున్నారని తెలిపారు. అయితే ఇది పరిశీలనాత్మక అధ్యయనమే తప్ప, క్లినికల్ ట్రయల్ కాదని ఆయన స్పష్టం చేశారు. చైనా నుంచి రావాల్సిన సెరోలాజికల్ టెస్టింగ్ కిట్స్ మంగళవారం నాటికి ఇండియా చేరుకుంటాయని గంగాఖేదార్ పేర్కొన్నారు.
Recommended Video
అసలేంటి ‘రెమ్డెసివిర్’?
కరోనా వైరస్ సోకడం ద్వారా తలెత్తే కొవిడ్-19 వ్యాధిని నయం చేసే వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. దానికి సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ కు కనీసం 5 నుంచి 15 నెలల సమయం పట్టొచ్చు. ఈలోపు ప్రత్యామ్నాయ మందుల ద్వారా వైరస్ ప్రభావాన్ని తగ్గిస్తూ, పేషెంట్ రోగనిరోధక శక్తిని పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటిదాకా కొవిడ్-19కు మలేరియా చికిత్సకు వాడే హైడ్రాక్సీక్లోరోక్విన్, జ్వరానికి వాడే పారా సిటిమాల్ మందులు బాగా పనిచేస్తున్నాయనే అభిప్రాయం ఉంది. వీటితోపాటు కొంతకాలంగా, యాంటీ ఎబోలా డ్రగ్ ‘రెమ్డెసివిర్'పైనా ఫోకస్ పెరిగింది. అమెరికాకు చెందిన ప్రఖ్యాత గిలియడ్ సైన్సెస్ అనే బయోటెక్నాలజీ కంపెనీ ‘రెమ్డెసివిర్'ను తయారుచేసింది. దాని అనుమతితో వివిధ దేశాలు కొవిడ్-19 చికిత్సలో యాంటీ ఎబోలా డ్రగ్ వాడుతున్నాయి. సుమారు 1700 మంది కొవిడ్-19 రోగులకు ఇంట్రా వీనస్ ద్వారా 10 రోజుల పాటు డ్రగ్ అందించగా, అధికశాతం మంది కోలుకున్నారని, ఆ తర్వాత వెంటిలేటర్ అవసరం లేకుండాపోయిందని ‘న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్'లో ప్రచురించారు.