కరోనా విలయం: మళ్లీ పెరిగిన వ్యాప్తి -దేశంలో కొత్తగా 26,624 కేసులు, 341 మరణాలు -1కోటి దాటి పైపైకి..
గ్లోబల్ గా కరోనా ఇన్ఫెక్షన్ల సంఖ్య 8కోట్లు, మరణాల సంఖ్య 17లక్షలకు చేరువయ్యాయి. ఇటు భారత్ లోనూ మొత్తం కేసుల సంఖ్య 1కోటి దాటేయగా, వైరస్ వ్యాప్తి మళ్లీ స్వల్పంగా పెరిగింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం వెలువరించిన బులిటెన్ వివరాలు ఇలా ఉన్నాయి...
గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11,07,681 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 26,624 కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,00,31,223కు చేరింది. శనివారం నాటి కేసులు(25,152) కంటే ఆదివారం కొత్త కేసుల సంఖ్య పెరగడం గమనార్హం. దేశంలో ఇప్పటిదాకా 16.11 కోట్ల టెస్టులను నిర్వహించారు.
ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం నిన్న ఒక్కరోజే వివిధ రాష్ట్రాల్లో కలిపి 341 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటి వరకు మహమ్మారితో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,45,477కి చేరింది. ఓవరాల్ గా ఇండియాలో మరణాల రేటు 1.45కు తగ్గినట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది. అటు రికవరీల పరంగానూ దేశంలో పరిస్థితులు మెరుగుపడ్డాయి..
గడిచిన 24 గంటల్లో కొత్తగా 29,960 మంది కొవిడ్ వ్యాధి నుంచి కోలుకున్నట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 95,80,402కు చేరింది. దేశంలో రికవరీ రేటు 95.46 శాతంగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 3,05,344 యాక్టివ్ కేసులు ఉన్నాయి. యాక్టివ్ కేసుల శాతం 3.04గా ఉన్నట్లు బులిటెన్ లో పేర్కొన్నారు.
కరోనా వైరస్కు అడ్డుకట్ట వేయడానికి భారత్ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ ఇతర దేశాల కంటే సమర్థమైనదని కేంద్ర ఆరోగ్య శాఖ ఒక వివరణలో తెలిపింది. కొద్ది రోజుల వ్యవధిలోనే టీకా అందుబాటులోకి రానుందని, తొలి విడతలో 30 కోట్ల మందికి వ్యాక్సిన్ను అందజేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన కేంద్రం.. వ్యాక్సిన్ పంపిణీ మార్గదర్శకాలు, సందేహాల నివృత్తి కోసం ఈ ప్రకటన చేసింది.