50వేలు దాటిన మరణాలు - దేశంలో తగ్గని కరోనా వ్యాప్తి - కొత్తగా 63వేలు, మొత్తం 26లక్షల కేసులు
రికవరీల్లో ముందున్నామన్న మాటేగానీ, దేశంలో కరోనా మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఆదివారం నాటికి మహమ్మారి కాటుకు బలైపోయినవాళ్ల సంఖ్య 50వేల మార్కు దాటింది. కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం గడిచిన 24 గంటల్లో 944 మంది కన్నుమూశారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 50,112కు పెరిగింది.
దేశంలో వైరస్ వ్యాప్తి ఇంకా కంట్రోల్ లోకి రాలేదు. కేంద్ర ఆరోగ్య శాఖ బులిటెన్ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 63,489 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నెల 7 నుంచీ ప్రతిరోజూ 60వేల కేసులకు తగ్గకుండా వస్తుండటం గమనార్హం. శనివారంనాడైతే రికార్డు స్థాయిలో 67,103 కొత్త కేసులు వచ్చాయి. ఆదివారం నాటి లెక్కలతో కలిపి దేశంలో ఇప్పటిదాకా నమోదైన ఇన్ఫెక్షన్ల సంఖ్య 26 లక్షలకు చేరింది.
సెప్టెంబర్ నాటికి పరిస్థితి మరింత దారుణంగా మారొచ్చన్న నిపుణుల అంచనాల నేపథ్యంలో.. మరణాల సంఖ్య 50 వేలు దాటడం విషాదకరం. మొత్తం మరణాల్లో 27 శాతం ఆగస్టు తొలి రెండు వారాల్లోనే నమోదు కావడం గమనార్హం. ఈ నెల 1 నుంచి 15 వరకు మొత్తం 13,500 మంది ప్రాణాలు కోల్పోయారు.
1947 ఇండియాకు, 2020 ఇండియన్ అమెరికన్లకు అత్యంత కీలకం: కమలా హ్యారిస్ - గెలిస్తే ఇలా చేస్తా..
ఇతర దేశాలతో పోల్చుకుంటే కొవిడ్-19 రికవరీల్లోనూ భారత్ ముందుంది. 71.6 శాతం రికవరీ రేటుతో ఇప్పటి వరకు 18.5లక్షల మంది వ్యాధి నుంచి కోలుకున్నారని, గడిచిన 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా 55వేల మంది వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని ఆరోగ్య శాఖ తెలిపింది. యాక్టివ్ కేసుల సంఖ్య 6.8లక్షలుగా ఉంది. కరోనా టెస్టుల సంఖ్యను రోజుకు 10లక్షలకు పెంచాలన్న ప్రధాని మోదీ పిలుపు మేరకు యంత్రాంగం పనిచేస్తున్నది. శనివారం ఒక్కరోజే 7.46లక్షల శాంపిల్స్ ను టెస్టు చేశారు. ఇప్పటిదాకా చేసిన టెస్టుల సంఖ్య 3కోట్లకు చేరువైనట్లు ఐసీఎంఆర్ తెలిపింది.
Recommended Video
కరోనా ఎఫెక్టెడ్ రాష్ట్రాల జాబితాలో టాప్ లో ఉన్న మహారాష్ట్రలో శనివారం అత్యధికంగా 12,614 కొత్త కేసులు వచ్చాయి. అక్కడ మొత్తం కేసులు 6లక్షలకు, మరణాల సంఖ్య 20 వేలకు చేరువయ్యాయి. తమిళనాడులో 3.32లక్షల కేసులు, 5,641 మరణాలు నమోదయ్యాయి. మూడో స్థానంలో ఉన్న ఏపీలో 2.81లక్షల కేసులు, 2562 మరణాలు నమోదయ్యాయి.