kerala: ఉధృతంగా కరోనా విలయం -కొత్తగా 22,414 కేసులు, 108 మరణాలు -1.7లక్షల యాక్టివ్, టీపీఆర్ 11.3
దక్షిణాది రాష్ట్రం కేరళలో కరోనా వైరస్ మహమ్మారి విలయం కొనసాగుతున్నది. రాష్ట్రంలో కొవిడ్ ఉద్థృతి ఆందోళనకర రీతిలో ఉంది. బుధవారం ఒక్కరోజే అక్కడ కొత్తగా 22,414 మందికి వైరస్ సోకగా.. 108 మంది కొవిడ్తో మృతి చెందడం కలవరపెడుతోంది. కేరళ ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన గణాంకాల ప్రకారం..
రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 34,71,563.. మరణాల సంఖ్య 17,211కి చేరింది. గడిచిన 24 గంటల్లో 1,97,092 శాంపిళ్లను పరీక్షించగా పాజిటివిటీ రేటు 11.37 శాతంగా నమోదైంది. 19,478 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. అయితే ఒక్క రోజులో కోలుకున్నవారి సంఖ్య కంటే ఎక్కువ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే అంశం. అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1,76,048 క్రియాశీల కేసులున్నాయి. కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా పలు జిల్లాల్లో 4,74,056 మంది కదలికలపై ప్రభుత్వం నిఘా పెట్టింది.
ఓ వైపు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండగా మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం బుధవారం పలు ఆంక్షలను సడలించింది. వారాంతపు లాక్డౌన్ ఇకపై ఆదివారం మాత్రమే విధించనున్నట్టు రాష్ట్ర సర్కారు తెలిపింది. అయితే స్వాతంత్ర్య దినోత్సవం, ఓనమ్ పర్వదినాల సందర్భంగా ఈ నెల 15, 22 తేదీల్లో లాక్డౌన్కు మినహాయంపు కల్పిస్తున్నట్టు వెల్లడించింది. అన్ని దుకాణాలను ఆదివారం మినహా ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తెరచి ఉంచేందుకు అనుమతులిచ్చింది.
కేరళలో రోజువారీ కేసులు భారీ స్తాయిలో పెరుగుతుండటంతో ప్రభుత్వం కట్టడికి కఠినమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధం అవుతోంది. ఇకపై ప్రతి ఆదివారం రోజున రాష్ట్రంలో సంపూర్ణ లాక్డౌన్ను అమలుచేయాలని నిర్ణయం తీసుకున్నారు. మూడోవేవ్ ప్రమాదం పొంచి ఉండటంతో కేరళ నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో సరిహద్దు రాష్ట్రాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్ ఉంటేనే రాష్ట్రంలోకి అడుగుపెట్టనిస్తామని తమిళనాడు, కర్ణాటక సర్కార్లు నిర్ణయాలు తీసుకున్నాయి.
Recommended Video
కేరళలో వేగంగా వ్యాక్సినేషన్ను అమలు చేస్తున్నప్పటికీ, కేసులు కంట్రోల్ కావడంలేదు. పైగా దేశంలో రోజువారీ కేసుల్లో సగం కేసులు కేరళ రాష్ట్రంలోనే నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే శనివారం,ఆదివారం రెండు రోజులు లాక్ డౌన్ విధించింది కేరళ ప్రభుత్వం. అయితే కొన్ని సడలింపులిచ్చింది. ప్రస్తుతం శనివారం లాక్ డౌన్ ఎత్తివేసి కేవలం ఆదివారం మాత్రం సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. కరోనా నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పదని హెచ్చరించింది.