దేశంలో కరోనా ప్రమాద ఘంటికలు..! జూన్ 30వరకూ లాక్డౌన్ పొడిగించిన ఆ రాష్ట్రం..!
ఢిల్లీ/హైదరాబాద్ : ఏం చేసినా, ఎంత చేసినా, ఎన్ని ఆంక్షలు విధించినా, ఎన్ని ముందుజాగ్రత్తలు తీసుకుంటున్నా దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మాత్రం తగ్గడంలేదు. దేశంలో లక్ష మైలురాయిని దాటిన కరోనా కేసులు రాష్ట్రాల్లో సైతం ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. కరోనా తీవ్రతను బట్టి ప్రాంతాలను జోన్లుగా విభజించడంతో కరోనా వ్యాప్తి జోరందుకుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టక ముందే లాక్డౌన్ ఆంక్షలను సడలించడం, చాలా వరకు మినహాయింపులివ్వడం వంటి చర్యలు కూడా కరోనా ఉదృతికి దారితీసాయనే చర్చ జరుగుతోంది.
పెరుగుతున్న కరోనా కేసులు..
మొదటి దశ లాక్డౌన్ ఆంక్షలు అమలు చేసినట్టుగానే మళ్లీ అమలు చేయాలని, పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించాలనే డిమాండ్ వినిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా కరోనా కరతాళ నృత్యం చేస్తున్న తరుణంలో కొన్ని రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. కరోనా మరింత ప్రాణ నష్టాన్ని కలిగించకముందే ముందస్తు జాగ్రత్తలను పాటించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి కొన్ని రాష్ట్రాలు. రాష్ట్రాల్లో ప్రబలుతున్న కరోనా కేసుల ఆధారంగా మళ్లీ లాక్డౌన్ ఆంక్షలను కఠినంగా అమలు చేసేందుకు రంగం సిద్దం చేస్తున్నాయి.
భారత్ లో లక్షదాటిని కేసులు..
భారతదేశంతో పాటు మరికొన్ని దేశాల్లో కరోనా వైరస్ కదలికలు చురుగ్గా లేవని, జూన్ లేదా జూలై నెలల్లో ఇది యాక్టీవ్ గా మారే అవకాశాలు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్ధ హెచ్చరికలు జారీ చేస్తోంది. చైనా లో కూడా కరోనా కేసుల సంఖ్య చెప్తున్నదానికంటే ఎక్కువగా ఉన్నాయని నిర్ధారిస్తోంది. అమెరికా, స్పెయిన్, ఇటలీ, ఆస్ట్రేలియా, బ్రిటన్, జపాన్ వంటి దేశాల్లో కరోనా వైరస్ ప్రభావం తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభించడం ప్రమాదకర సంకేతాలకు నిదర్శనమని ప్రపంచ ఆరోగ్య సంస్ధ ముందస్తు జాగ్రత్తలు అందిస్తోంది. కరోనా వైరస్ పట్ల ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా పంజావిసిరే అవకాశాలు ఉన్నాయని విశ్లేషింస్తోంది డబ్ల్యూహెచ్ఓ. ఇందుకనుగుణంగానే దేశంలోని కొన్ని రాష్ట్రాలు మళ్లీ లాక్డౌన్ ఆంక్షల దిశగా అడుగులు వేస్తున్నాయి.
జూన్ 30 వరకూ లాక్డౌన్ పొడిగింపు
ఇక భారత దేశంలో కరోనా వైరస్ కట్టడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సవాల్ గా పరిణమించింది. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు కేంద్రపెద్దలు. ఇదే క్రమంలో తాజాగా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం మరోసారి లాక్డౌన్ ఆంక్షలను పొడిగించాలని నిర్ణయించింది. జూన్ 30 వరకూ లాక్డౌన్ పొడిగించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం పొగిడించనుంది. హిమాచల్లో ప్రస్తుతం 214 వైరస్ కేసులు నమోదవగా వీరిలో అరవైమూడు మంది కోలుకున్నారు. కరోనా మహమ్మారి బారినపడి ఐదుగురు మరణించారు. హిమాచల్ప్రదేశ్లోని హమీర్పూర్ జిల్లాలో కరోనా కేసులు అధికంగా నమోదైన విషయం తెలిసిందే.
దేశవ్యాప్తంగా మరోసారి లాక్డౌన్..
పలు రాష్ట్రాలు లాక్డౌన్ నిబంధనలను సడలించడం, అనేక మినహాయింపులివ్వడం, కేంద్ర ప్రభుత్వం దేశీయ విమాన సర్వీసులు ప్రారంభించిన క్రమంలో హిమాచల్ప్రదేశ్ లాక్డౌన్ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇక కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్డౌన్ను నాలుగు దఫాలుగా పొడిగిస్తూ వచ్చింది. తాజా లాక్డౌన్ ఈనెల మే 31తో ముగియనుంది. అత్యధిక కేసులతో తల్లిడిల్లుతున్న మహారాష్ట్ర మాత్రమే ఇప్పటివరకూ లాక్డౌన్ పొడిగింపును కోరుతోంది. ఇక దేశంలోని మిగతా రాష్ట్రాలు మాత్రం ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా లాక్డౌన్ సడలింపులు ఇవ్వాలని కోరుతున్నాయి. కాగా దేశంలో రికార్డు స్తాయిలో నమోదవుతున్న కేసులు, డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికల నేపథ్యలో లాక్డౌన్ మళ్లీ అమలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.