దేశంలో కరోనా మహమ్మారి పరిస్థితి అధ్వాన్నం: 10 జిల్లాల్లో అత్యధికం, పంజాబ్ సర్కారు విఫలం
న్యూఢిల్లీ: దేశంలో గత కొద్ది వారాలుగా కరోనావైరస్ మహమ్మారి కేసులు భారీగా నమోదవుతున్న క్రమంలో కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల కాలంలో కరోనా కేసులు ఐదు రెట్లు పెరిగాయని, పరిస్థితి తీవ్రంగానే ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరించింది. ప్రజలంతా కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. మాస్కులు ముక్కుపైనే ఉండాలని సూచించింది.
దేశంలో కరోనా తీవ్ర పరిస్థితి..
దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో నీతి ఆయోగ్(ఆరోగ్యం) సభ్యుడు డాక్టర్ వీకే పాల్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. గత జులై నుంచి కరోనా కేసులు విపరీతంగా పెరిగాయి. సెప్టెంబరులో వైరస్ మరింత తీవ్రమైంది. ఆ తర్వాత నుంచి కరోనా కాస్త తగ్గుముఖం పట్టినట్లు కన్పించింది. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరి మధ్య నుంచి మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పుడు కొన్ని జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, దీంతో యావత్ దేశం ప్రమాదంలో పడుతోందన్నారు.
కరోనా నిబంధనలు పాటించాల్సిందే..
వైరస్ వ్యాప్తిని కట్టడి చేసి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. అయితే, కరోనా కట్టడికి ప్రజలంతా కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని వీకే పాల్ సూచించారు. వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షలు పెంచాలన్నారు. కాంటాక్ట్ ట్రేసింగ్ చేపట్టి కరోనా సోకినవారిని ఐసోలేషన్లో ఉంచాలన్నారు
మహారాష్ట్రలో కరోనా ఆందోళకరమే..
దేశ వ్యాప్తంగా 10 జిల్లాల్లో అత్యధిక యాక్టివ్ కేసులున్నాయి. ఇందులో 8 జిల్లాలు ఒక్క మహారాష్ట్రవే కావడం గమనార్హం. 59వేలకుపైగా యాక్టివ్ కేసులతో పుణె అగ్రస్థానంలో ఉండగా.. ముంబై, నాగ్పూర్, థానే, నాసిక్, ఔరంగాబాద్, బెంగళూరు అర్బన్, నాందేడ్, ఢిల్లీ, అహ్మద్నగర్లో అత్యధిక యాక్టివ్ కేసులున్నాయి. దేశ వ్యాప్తంగా 5,40,720 యాక్టివ్ కేసులున్నాయి.
పంజాబ్ సర్కారు అలసత్వం వల్లే పెరుగుతున్న కరోనా కేసులు
పంజాబ్ రాష్ట్రంలో అక్కడి ప్రభుత్వ అలసత్వం వల్లే కరోనా కేసులు పెరుగుతున్నాయని ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు. కరోనా పరీక్షలు చేయడం లేదని, వైరస్ సోకిన వారిని ఐసోలేషన్లో ఉంచడంలోనూ పంజాబ్ ప్రభుత్వం విఫలమైందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫిబ్రవరిలో పంజాబ్ రాష్ట్రంలో సగటు రోజువారీ కేసులు 240గా ఉండేవని, ఇప్పుడు రోజుకు 2700 కేసులు వస్తున్నాయి. అక్కడి ప్రభుత్వం సరిగ్గా కాంటాక్ట్ ట్రేసింగ్ చేయకపోవడం వల్లే కేసులు పెరిగాయన్నారు. కాగా, ఏప్రిల్ 1వ తేదీ నుంచి 45ఏళ్లు పైబడినవారందరూ టీకాలు వేసుకునేందుకు అర్హులేనని ఆయన తెలిపారు.