నేను బతికింది చాలు, యువకుడికి బెడ్ ఇవ్వండి :ఆస్పత్రి నుంచి వృద్ధుడి వాకౌట్, మృతి -కదిలించే గాథ
మామూలుగానే సగటు మనిషికి ప్రాణతీపి ఎక్కువ. ఏదైనా ఆపత్తో, విపత్తో తలెత్తితే అందరికంటే ముందు తామే బయటపడాలనుకోవడమూ సహజంగా జరిగేదే. అయితే, మహాత్ములు, మానవతావాదులు మాత్రం ఇందుకు మినహాయింపు. పొరుగువాడిని చూసి దూరంగా పారిపోతోన్న కరోనా విలయకాలంలోనూ అలాంటి మానవతావాదులు సైలెంట్ గా తమ పని చేసుకుంటూ పోతున్నారు. ప్రభుత్వాలు, వ్యవస్థల వైఫల్యం సంగతి ఎలా ఉన్నా, వ్యక్తిగత స్థాయిలో కొందరు అసాధారణ త్యాగనిరతిని చూపెడుతున్నారు. తోటి వాడి కోసం ప్రాణత్యాగానికి సైతం వెనుకాడని ఈ వృద్ధుడి గాథ కరోనా విలయకాలంలో అందరినీ కదిలిస్తున్నది..
85ఏళ్ల నారాయణ్ దబల్కర్
దేశంలో కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తిలోనూ మహారాష్ట్ర మోస్ట్ ఎఫెక్టెడ్ గా కొనసాగుతున్నది. ముంబై తర్వాత నాగపూర్ సిటీలో భారీగా కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. నాగపూర్కే చెందిన 85 ఏళ్ల నారాయణ్ దబల్కర్ కు ఇటీవలే కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. శ్వాస తీసుకోవడానికి కొద్దిగా ఇబ్బందిపడుతోన్న దశలో కుటుంబీకులు ఆయను అతి కష్టం మీద నాగపూర్ లోని ఇందిరాగాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆ ఆస్పత్రి క్యాజువాలిటీ వార్డులోనూ బెడ్లన్నీ నిండుకోగా, కాస్త ఆలస్యంగా నారాయణ్ కు బెడ్ దొరికింది. కానీ..
జగన్ బెయిల్ రద్దు: సీఎం, సీబీఐకి భారీ షాక్ -ఎంపీ రఘురామ పిటిషన్ను స్వీకరించిన కోర్టు -నోటీసులు
యువకుడి కోసం వృద్ధుడి త్యాగం..
నారాయణ్ దబోల్కర్ ఆస్పత్రి బెడ్ పై ఉండగా, అక్కడి సిబ్బందిని ప్రాధేయపడుతోన్న మహిళను చూశాడు. కరోనా సోకిన తన 40 ఏండ్ల భర్తను ఆసుపత్రిలో చేర్చుకోవాల్సిందిగా ఆ మహిళ వేడుకోగా, బెడ్లు ఖాళీగా లేవని డాక్టర్లు చెప్పడం అతను విన్నాడు. వెంటనే తన కూతురికి ఫోన్ చేసి తాను ఆస్పత్రిలో ఉండాలనుకోవడంలేదని, తాను ఖాళీ చేస్తే ఆ బెడ్ యువకుడికి దొరికే అవకాశం ఉంటుందని కన్విన్స్ చేశాడు. డాక్టర్లు, ఆస్పత్రి సిబ్బందికి కూడా ఇదే విషయాన్ని వివరించి, స్వచ్ఛందంగా ఇంటికి తిరిగెళ్లిపోయాడు..
Recommended Video
నేను బతికింది చాలు.. పాపం చిన్నారులు..
''నాకిప్పుడు 85 ఏళ్లు. జీవితంలో చాలా చూశాను. ఇక బతికింది చాలు. చివరి క్షణాలు ఇంట్లోనే గడపాలనుకుంటున్నాను. పాపం ఆ అమ్మాయి భర్తను తలుచుకుంటే బాధగా ఉంది, వాళ్ల పిల్లలు ఇంకా చిన్నవాళ్లేనట. నేను బెడ్ ఖాళీ చేస్తే అతనికి ట్రీట్మెంట్ పొందే అవకాశం దక్కుతుంది'' అని నారాయణ్ దబోల్కర్ చివరిమాటగా అన్నారని కుటుంబీకులు తెలిపారు. యువకుడి కోసం బెడ్ త్యాగం చేసిన మూడు రోజులకే నారాయణ్ కరోనాతో కన్నుమూశారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్త అయిన నారాయణ్ త్యాగనిరతిపై స్థానికంగా కథనాలు ప్రసారం అయ్యాయి. కాగా, వృద్ధుడి త్యాగనిరతిని ప్రశంసిస్తూనే నాగపూర్ ఆస్పత్రి సిబ్బంది కీలక విషయాన్ని వెల్లడించారు. ఒక పేషెంట్ స్వచ్ఛందంగా తప్పుకొని తాను కోరిన మరో పేషెంట్ కు బెడ్ ఇచ్చే వీలు, అవకాశమేదీ లేదని, లిస్టులో ఉన్న రోగుల కడిషన్ ను బట్టి ఐసీయూకు పంపాలా లేక క్యాజువాలిటీలోనే ఉంచాలా అన్నది డాక్టర్లే నిర్ణయిస్తారని, లక్కీగా నారాయణ్ కోరుకున్నట్లే ఆ 40ఏళ్ల పేషెంట్ కు బెడ్ దొరికిందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.