Bharat Jodo Yatra : భారత్ జోడో యాత్రకు కరోనా ముప్పు- రాహుల్ కు కేంద్రం హెచ్చరికలు !
దేశంలో బీజేపీ చేస్తున్న విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర జోరుగా సాగిపోతోంది. తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైన ఈ యాత్ర.. ఇప్పుడు రాజస్తాన్ లో సాగుతోంది. అయితే దేశంలోకి మరోసారి కరోనా వైరస్ ప్రవేశించిందన్న హెచ్చరికలు రాహుల్ భారత్ జోడో యాత్రను కలవరపెడుతున్నాయి. ఈ నేపధ్యంలో కేంద్రం ఇవాళ రాహుల్ కు ముందస్తు హెచ్చరికలు పంపింది.
భారత్ జోడో యాత్రలో భారీ ఎత్తున కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో పాటు తటస్ధ వర్గాల ప్రజలు కూడా తరలివచ్చి సంఘీభావం ప్రకటిస్తున్నారు. రాహుల్ ను చూసేందుకు, కలిసేందుకు, మాట్లాడేందుకు, ఫొటోలు దిగేందుకు వచ్చేవారితో జోడో యాత్ర ఎప్పుడూ సందడిగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున హాజరవుతున్న వారిలో ఎవరో ఒకరు కరోనా వైరస్ ను వ్యాప్తి చేస్తే మాత్రం ఇబ్బందులు తప్పవని కేంద్రం భావిస్తోంది. దీంతో రాహుల్ గాంధీకి కేంద్ర ఆరోగ్యమంత్రి మన్ సుఖ్ మాండవీయ తాజాగా లేఖ రాశారు.

రాహుల్ గాంధీకి రాసిన లేఖలో ఆరోగ్యమంత్రి మాండవీయ.. భారత్ జోడో యాత్రలో కోవిడ్ ప్రోటోకాల్ ను తప్పనిసరిగా పాటించాలని కోరారు. దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు, జోడో యాత్రకు భారీగా హాజరవుతున్న జనాన్ని దృష్టిలో ఉంచుకుని కోవిడ్ నిబంధనల్ని పక్కాగా పాటించాలని మాండవీయ కోరారు. అంతే కాదు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారినే ఈ యాత్రలో అనుమతించాలని కూడా సూచించారు. దీంతో రాహుల్ గాంధీ దీనిపై స్పందించి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనేది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది.












Click it and Unblock the Notifications