అమ్మకు ప్రతిరూపం చిన్నమ్మ.. హైకోర్టు వ్యాఖ్యలు బాధాకరం: సీఆర్ సరస్వతి
చిన్నమ్మ శశికళ అమ్మ జయలలితకు ప్రతిరూపం అని సరస్వతి పేర్కొనడం గమనార్హం.
చెన్నై: తమిళ దివంగత సీఎం జయలలిత మృతిపై మద్రాస్ హైకోర్టు అనుమానాలు వ్యక్తం చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అమ్మ మృతిపై దాఖలైన పిటిషన్ ను విచారించిన జస్టిస్ వైద్యనాథన్.. అనుమానాలకు ఊతమిచ్చేలా వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలపై అన్నాడీఎంకె నాయకురాలు సీఆర్ సరస్వతి స్పందించారు. హైకోర్టు వ్యాఖ్యలు బాధాకరమన్నారు. జయలలిత ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆమె ఆరోగ్యంపై కేంద్రానికి ప్రతీరోజు సమాచారం అందిందన్నారు. అవసరమనుకుంటే న్యాయస్థానం కేంద్రం నుంచి సమాచారం తెప్పించుకోవచ్చని సూచించారు.

శశికళ నాయకత్వ పటిమ గురించి జయలలితే పలుమార్లు చెప్పారని సరస్వతి చెప్పారు.చిన్నమ్మ శశికళ అమ్మ జయలలితకు ప్రతిరూపం అని సరస్వతి పేర్కొనడం గమనార్హం. చిన్నమ్మ నాయకత్వంలో పార్టీ సమర్థవంతంగా పనిచేయగలదని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.
కాగా, జయ మరణానికి సంబంధించి నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. జయకు అందించిన చికిత్స వివరాలను వెల్లడించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్లో ప్రతివాదులుగా జయ నెచ్చెలి శశికళ నటరాజన్, సీఎం పన్నీర్ సెల్వం, లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై, అపోలో ఆసుపత్రి చైర్మన్ పీసీ రెడ్డి తదితరులను చేర్చినట్టు గీత వెల్లడించారు.












Click it and Unblock the Notifications