బుర్హాన్ కాల్చివేత: అట్టుడికిన కాశ్మీర్, బీజేపీ ఆఫీస్పై దాడి
శ్రీనగర్: హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వని ఎన్ కౌంటర్ పైన శనివారం కాశ్మీర్ అట్టుడికింది. ఆందోళనకారులు విధ్వంసానికి పాల్పడ్డారు. పోలీసులతో ఘర్షణకు దిగడంతో పదకొండు మంది మరణించారు. మరో 126 మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిలో 96 మంది భద్రతా సిబ్బందే.
కాశ్మీర్లో చిక్కుకున్న తెలుగోళ్లు: హీరోలా.. ఎవరీ 'టెర్రరిస్ట్' బుర్హాన్?
కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో యువకులు పోలీసు పోస్ట్లు, సెక్యురిటీ సిబ్బందిపై దాడులకు దిగారు. కుల్గాంలో కాల్పుల్లో కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించారని, మరో వ్యక్తి నదిలో మునిగి దుర్మరణం పాలయ్యాడని పోలీసులు తెలిపారు. ఘర్షణల కారణంగా పలువురు గాయపడ్డారు.
కుల్గాంలోని బీజేపీ ఆఫీస్ పైన ఆందోళనకారులు దాడులు చేశారు. బందిపొరా, ఖాజిగండ్, లార్నో, అనంతనాగ్ తదితర ప్రాంతాల్లో పోలీసు చెక్పోస్ట్లపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. కుల్గాం జిల్లాలో పలుచోట్ల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి.
పోలీసులు, భద్రత సిబ్బంది పరిస్థితి అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలో ఇప్పటికే శ్రీనగర్ సహా పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. మొబైల్ ఇంటర్నెట్సేవలను నిలిపేశారు. అమర్నాథ్ యాత్రను కూడా తాత్కాలికంగా ఆపేశారు.
శుక్రవారం రాత్రి అనంతనాగ్లోని కొకేర్నాగ్ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో బుర్హాన్తో పాటు మరో ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. సామాజిక మాధ్యమాల ద్వారా యువతను ఉగ్రవాదంవైపు ఆకర్షిస్తున్న బుర్హాన్ను మట్టుబెట్టడం సైన్యం భారీ విజయంగా భావిస్తోంది.
అయితే రాష్ట్రంలో బుర్హాన్ మృతిపట్ల తీవ్ర ఆందోళనలు జరుగుతున్నాయి. త్రాల్ నగరంలోని ఈద్గా వద్ద జరిగిన బుర్హాన్ అంత్యక్రియలకు పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చారు. కొందరు వేర్పాటు వాద నేతలు త్రాల్ వచ్చేందుకు ప్రయత్నించగా భద్రత సిబ్బంది అడ్డుకున్నారు.