అరెస్టు: 24 గంటల్లో యువకుడి లాకప్ డెత్!
భువనేశ్వర్: దొంగతనం చేశాడనే అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకున్న ఓ యువకుడు లాకప్ లో అనుమానాస్పదస్థితిలో మరణించిన సంఘటన ఓడిషాలో జరిగింది. ఓడిషాలోని మయుర్ భంజ్ జిల్లాలోని బారిపాడ పోలీస్ స్టేషన్ లో ఈ సంఘటన జరిగింది.
బారిపాడ పోలీసులు దొంగతనం చేశారనే అనుమానంతో చందన్ దాస్ (32) అతని సోదరుడు రాజన్ ను సోమవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. తరువాత పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్లి విచారణ చేశారు.
ఇద్దరిని లాకప్ లో వేశారు. తరువాత రాజన్ మాత్రం వదిలేశారు. అయితే మంగళవారం చందన్ దాస్ లాకప్ లోనే శవమైనాడు. విషయం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు, బంధువులు పోలీస్ స్టేషన్ దగ్గరకు చేరుకుని ఆందోళనకు దిగారు.
చందన్ దాస్ ను పట్టుకుని వచ్చి లాకప్ లో కొట్టి చంపేశారని వారు ఆరోపించారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ అనూప్ క్రిష్ణ, ఏఎస్పీ గోవింద్ చంద్రా మల్లిక్ పోలీస్ స్టేషన్ దగ్గరకు చేరుకుని ఆందోళనకారులకు నచ్చ చెప్పారు.
చందన్ దాస్ మృతికి కారణం అయ్యారని ఆరోపణలు ఎదుర్కోంటున్న ఏఎస్ఐలు బిక్రమ్ లెంక, ఉమేష్ నాయక్, మహిళా కానిస్టేబుల్ దీప్తిలను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ అనూప్ క్రిష్ణ అక్కడే ఆదేశాలు జారీ చేశారు.
చందన్ దాస్ శరీరం మీద గాయాలు ఉన్నాయని, అతనిని కావాలనే లాకప్ డెత్ చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతుడి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి రూ. ఒక లక్ష నష్టపరిహారం ఇప్పిస్తామని జిల్లా ఎస్పీ అనూప్ క్రిష్ణ చెప్పారు.
ఏఎస్పీ గోవింద్ చంద్రా మల్లిక్ ఆద్వర్యంలో ప్రత్యేక టీం చందన్ దాస్ ఎలా మరణించాడు అని దర్యాప్తు చేస్తున్నారు. చందన్ దాస్ ఆత్మహత్య చేసుకున్నాడా, లాకప్ డెత్ అయ్యాడా అనే కోణంలో విచారణ చేస్తున్నామని ఏఎస్పీ గోవింద్ చంద్రా మల్లిక్ తెలిపారు.