రాహుల్ కాకుంటే మరెవరు- వచ్చేవారం తేల్చేయనున్న సీడబ్ల్యూసీ- ఎన్నికలవైపే మొగ్గు....
కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న నాయకత్వ సంక్షోభానికి తెరదించేందుకు తుది ప్రయత్నాలు సాగుతున్నాయి. పార్టీ నడిపించే నేతను ఎంపిక చేసే విషయంలో నేతల నుంచి పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో ఈ విషయంలో ఏదో ఒకటే తేల్చేయాలని అధినేత్రి సోనియాగాంధీ భావిస్తున్నారు. ఈ మేరకు వచ్చేవారం వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహించాలని భావిస్తున్నారు. ఇందులో అధ్యక్ష ఎన్నికలపై పార్టీ పెద్దలు కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ నాయకత్వాన్ని గాంధీ కుటుంబేతరులకు ఇచ్చేందుకు సిద్ధమని ప్రియాంక ప్రకటించిన నేపథ్యంలో ఈ భేటీ కీలకంగా మారింది.
కాంగ్రెస్ నాయకత్వంపై ఒత్తిడి...
125 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం నాయకత్వ లేమితో సతమతం అవుతోంది. వరుసగా రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోరపరాజయంతో శతాధిక వయసు కలిగిన కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. దీన్నుంచి కోలుకుని తిరిగి గాడిన పడేందుకు అవసరమైన ప్రయత్నాలు కూడా అధినేత్రి సోనియా గాంధీ చేపట్టకపోవడంతో నేతల్లో భవిష్యత్తుపై ఆందోళన పెరుగుతోంది. దీంతో ఏదో ఒకటి తేలుస్తారా లేక తమ దారి తాము చూసుకోమంటారా అంటూ పార్టీ నేతలు అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారు. తాజాగా వంద మందికి పైగా కాంగ్రెస్ నేతలు నాయకత్వ సమస్య తీర్చాలంటూ సోనియాగాంధీకి లేఖ రాయడం పరిస్ధితి తీవ్రతకు అద్దం పడుతోంది. దీంతో అసలే అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సోనియాకు ఇదో పెద్ద తలనొప్పిగా మారిపోయింది.
ప్రియాంక ప్రకటనతో షాక్..
ఇప్పటివరకూ గాంధీ కుటుంబంపైనే అన్నింటికీ ఆధారపడుతూ వచ్చిన కాంగ్రెస్ పార్టీకి తాజాగా సోనియా కుమార్తె ప్రియాంక చేసిన ప్రకటన విస్మయానికి గురి చేసింది. ఇన్నాళ్లూ గాంధీ కుటుంబం లేకుండా కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదనే పరిస్ధితిని దాటి ఇక చాలు మేం తప్పుకుంటాం మీలో ఎవరైనా బాధ్యతలు తీసుకోండంటూ ప్రియాంక చేసిన ప్రకటన దేశ రాజకీయాల్లోనే కీలకంగా మారింది. ఈ ప్రకటన వెనుక చాలా కారణాలే ఉన్నాయి. గాంధీ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ అధికార బీజేపీ చేస్తున్న రాజకీయాలు, గాంధీ కుటుంబం వల్లే దేశం ఇన్ని సమస్యలు ఎదుర్కొంటోందంటూ జరుగుతున్న ప్రచారం ఆ కుటుంబాన్ని తీవ్రంగా బాధిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా క్యాడర్ కలిగిన పార్టీ .. ఇలా ప్రత్యర్ధుల విమర్శలకు తావివ్వకూడదని భావించడం వల్లే ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
వచ్చేవారం సీడబ్ల్యూసీ భేటీ...
రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు స్వీకరించేందుకు సిద్దంగా లేకపోవడం, గాంధీ కుటుంబం నాయకత్వం రేసులో లేదని ప్రియాంక తేల్చేయడంతో ఇక బాధ్యతలు చేపట్టేందుకు ఎవరికి వారు రంగంలోకి దిగుతున్నారు. పార్టీ సీనియర్లు, పదవిని ఆశిస్తున్నవారు ఇప్పటికే హంగామా మొదలుపెట్టేశారు. దీంతో టెన్ జనపథ్ కు పార్టీ నేతల తాకిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో నాయకత్వం విషయంలో ఏదో ఒకటి తేల్చేస్తేనే మంచిదని సోనియా కూడా భావిస్తున్నారు. అందుకే వచ్చేవారం సీడబ్ల్యూసీ భేటీ ఏర్పాటు చేసి ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకునే దిశగా పావులు కదుపుతున్నారు. ఇందులో పార్టీ సీనియర్ల అభిప్రాయాలు తీసుకుని సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
Recommended Video
విధేయులకే అవకాశం...
పార్టీ నాయకత్వాన్ని తేల్చేందుకు అధ్యక్ష ఎన్నికలే నిర్వహించాల్సి వస్తే కాంగ్రెస్ పార్టీలో సీనియర్లుగా ఉన్న వారు ఎలాగో పోటీలో నిలుస్తారు. ఇందులోనూ తిరిగి గాంధీ కుటుంబానికి విధేయులుగా ఉన్న వారే ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓసారి గాంధీ కుటుంబం ఎవరివైపు మొగ్గితే వారికే అవకాశాలు ఎక్కువగా ఉండబోతున్నాయి. ఇప్పటికే సీడబ్ల్యూసీలో ఉన్న వారిలో పలువురు గాంధీ కుంటుంబానికి వీర విధేయులుగా ఉన్నారు. వీరిలో చాలా మంది ఇప్పటికే నాయకత్వ రేసులో తాము ఉన్నట్లు సంకేతాలు కూడా ఇచ్చేస్తున్నారు. దీంతో వీరిలో ఎవరికి పార్టీ పగ్గాలు అందిస్తే భవిష్యత్తులో సమస్యలు లేకుండా ఉంటాయో తేల్చుకున్న తర్వాతే గాంధీ కుటుంబం ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.