Cyber crimes: క్రెడిట్కార్డు అప్డేట్, కేవైసీ అప్డేట్ అంటే నమ్మారో.. మీ బ్యాంకుఖాతాలు ఖాళీ!!
సైబర్ మోసాలపై పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఎంత పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా సైబర్ నేరగాళ్లు రోజుకో రకంగా సైబర్ మోసాలకు తెగబడుతూనే ఉన్నారు. రోజుకో కొత్త దారులలో, కొత్త కొత్త ఆలోచనలతో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ఏ మాత్రం అప్రమత్తంగా లేకున్నా సైబర్ నేరగాళ్లు వారి ఖాతాల్లో డబ్బులు ఖాళీ చేస్తున్నారు.

క్రెడిట్ కార్డ్, కేవైసీ అప్డేట్ అంటే నమ్మకండి
ఇక తాజాగా క్రెడిట్ కార్డు అప్డేట్ చేస్తామంటూ లేదా కేవైసీ అప్డేట్ చేస్తామంటూ ఎవరైనా కాల్ చేస్తే, లేదా మెసేజ్ పంపించి కాల్ చేయమని నంబర్ ను సూచిస్తే, అటువంటి మెసేజ్ ల పట్ల , కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. అసలు వాటికి రెస్పాండ్ కావద్దని హెచ్చరిస్తున్నారు. క్రెడిట్ కార్డు అప్డేట్ లేదా కేవైసీ పేరిట వచ్చే కాల్స్ ను నమ్మకూడదని, మిమ్మల్ని ఎవరైనా డీటెయిల్స్ ఇవ్వమని అడిగితే ఇవ్వకండి అని సూచిస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు.

దేశంలో బాగా పెరిగిన కేవైసీ సంబంధిత మోసాలు, మధ్యతరగతి వాళ్ళే టార్గెట్
ఆన్ లైన్ ద్వారా చెల్లింపులు, ఆన్లైన్ మార్కెటింగ్ మరియు ఆన్లైన్ బ్యాంకింగ్ పెరగడంతో, భారతదేశంలో మునుపెన్నడూ లేని విధంగా అనేక కేవైసీ-సంబంధిత మోసాలు పెరిగాయని, అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మోసగాళ్లు ప్రజలను మోసం చేసేందుకు ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులను ఆవిష్కరిస్తున్నారని చెబుతున్నారు. 2021- 2022 ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ మొత్తంలో కేవైసీ మోసాలు విద్యావంతులైన మధ్యతరగతి వారిని టార్గెట్ చేస్తూ జరిగాయని సైబర్ క్రైమ్ పోలీసుల వద్ద నమోదైన కేసుల ఆధారంగా తెలుస్తోంది.

కస్టమర్ కు కాల్ చేసి భయపెడుతున్న సైబర్ క్రిమినల్స్ .. నమ్మారో ఖాతాలు ఖాళీ
సైబర్ నేరగాళ్లు కేవైసీ సమాచారాన్ని అప్డేట్ చేయడానికి కస్టమర్ కు కాల్ చేసి, కేవైసీ అప్డేట్ చేసుకోకపోతే మీ ఖాతాలో నిలిచిపోతుంది అని చెబుతూ కస్టమర్ ను భయపెట్టే ప్రయత్నం చేస్తారు. అలా ఖాతా నిలిచి పోకుండా కొనసాగాలంటే కేవైసీ అప్డేట్ చేసుకోవాలని తాము అడిగిన డీటెయిల్స్ ఇవ్వాలని చెబుతారు. వారి మాటలు నమ్మి పొరపాటున కేవైసీ అప్డేట్ కు, వివరాలు ఇస్తే బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బులను ఖాళీ చేస్తున్నారని, అందుకే కేవైసీ అప్డేట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే కాల్స్ కు స్పందించవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వొద్దు అంటున్న ఆర్బీఐ
సైబర్ మోసగాళ్లు ఖాతా లాగిన్ సమాచారం, కార్డ్ సమాచారం మరియు ఓటిపి వంటి వారి వివరాలను పంచుకోమని అడగడం ద్వారా కస్టమర్లను సులభంగా ట్రాప్ చేస్తున్నారని, తద్వారా వారు వారి బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. ఇటీవలి రోజుల్లో, కేవైసీ సంబంధిత మోసాలపై నమోదు చేయబడిన కేసుల సంఖ్య రెండింతలు పెరిగిందని ఆర్బిఐ కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది . కస్టమర్లు తమ వ్యక్తిగత సమాచారాన్ని తెలియని వ్యక్తి లేదా సంస్థతో పంచుకోవద్దని హెచ్చరిస్తుంది. ఆర్బీఐ కూడా తమ వెబ్సైట్లో బ్యాంకులు అలాంటి సమాచారాన్ని అడగవని, కస్టమర్లు ఆ విషయాన్ని తెలుసుకోవాలని స్పష్టంగా పేర్కొంది. ఇక ఇదే విషయాన్ని బాధ్యతగా అనేక బ్యాంకులు సైతం కస్టమర్లకు మెసేజ్ లు పంపుతున్నాయి. అందుకే తస్మాత్ జాగ్రత్త!!












Click it and Unblock the Notifications