ఓ మహిళా టెక్కీ చేదు అనుభవం.... జూమ్ మీటింగ్లో బాస్ను అలా చూసి షాక్....
కరోనా లాక్ డౌన్ మొదలయ్యాక చాలావరకు ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న సంగతి తెలిసిందే. చాలామంది ఉద్యోగులు ఆఫీస్ కంటే ఇదే బెస్ట్ అని భావిస్తుండగా.. మరికొందరి అభిప్రాయం మాత్రం భిన్నంగా ఉంది. ముఖ్యంగా కొంతమంది మహిళా ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్తో కొత్త సమస్యలను ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. దీనిపై ఓ ప్రముఖ జాతీయ మీడియా ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది.

ఓ మహిళా టెక్కీ చేదు అనుభవం...
అనిత(38) ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగి. ఆమెకు ఇద్దరు పిల్లలు. లాక్ డౌన్ పీరియడ్ మొదలైనప్పటి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఇదే క్రమంలో ఓరోజు బాస్ నుంచి మెసేజ్ వచ్చింది. అర్జెంటుగా వన్-ఆన్-వన్ జూమ్ మీటింగ్కి రావాలన్నది దాని సారాంశం. వెంటనే ల్యాప్టాప్ ఓపెన్ చేసిన అనిత ఆన్లైన్ జూమ్ సమావేశానికి లాగిన్ అయింది. అలా లాగిన్ అయిందో లేదో... స్క్రీన్పై కనిపించిన సీన్ చూసి షాక్ తిన్నది.

బాస్ షోఅప్...
అటువైపు ఉన్న బాస్ అవతారాన్ని చూసి ఆమె చాలా ఇబ్బందిగా ఫీల్ అయింది. తొడలు కనిపించేలా పొట్టి నిక్కర్(బాక్సర్),చెస్ట్ కనిపించేలా ఉన్న టీషర్టులో అతన్ని చూసి లోలోపలే విసుక్కుంది. అంతేనా... మీటింగ్ జరుగుతున్నంత సేపు కావాలనే చేతులు ఎక్కడెక్కడో పెట్టుకోవడం, రుద్దుకోవడం చూసి ఆమె అసహనం మరింత పెరిగింది. కానీ ఏం చేయగలదు... అవతలి వైపు ఉన్నది బాస్ కావడంతో... తప్పక,మనసొప్పక 15నిమిషాలు ఇబ్బందిగానే స్క్రీన్ ముందు కూర్చున్నది. అనిత పట్ల అతను అసభ్యంగా ప్రవర్తించకపోయినప్పటికీ... ఆమె ముందు షోఅప్ చేయాలనే మనస్తత్వం ఆమెను బాగా ఇబ్బందిపెట్టింది.

ఆన్లైన్ గేమింగ్స్లోనూ వేధింపులు...
ఆన్లైన్ జూమ్ మీటింగ్సే కాదు... ఆఖరికి ఆన్లైన్ గేమింగ్లోనూ యువతులకు వేధింపులు ఎదురవుతున్నాయి. కోల్కతాలోని ఓ యాడ్ ఏజెన్సీలో పనిచేసే వినితా గుప్తా(27) అనే యువతి లాక్ డౌన్ పీరియడ్లో కాలక్షేపం కోసం ఆన్లైన్ గేమ్స్ ఆడటం మొదలుపెట్టింది. గేమ్స్ బాగానే ఎంజాయ్ చేసినప్పటికీ... ఆన్లైన్లో తోటి మేల్ ప్లేయర్స్ నుంచి వేధింపులు మొదలవడం ఆమెను తీవ్రంగా కలచివేశాయి. తమతో గడిపేందుకు నీ రేటెంతో చెప్పాలని కొందరు తనను వేధించినట్లు వెల్లడించింది.అంతేకాదు,వాళ్ల ప్రతిపాదనలను తాను తిరస్కరిస్తే రేప్ చేస్తామని బెదిరించేవారని వినీతా గుప్తా తెలిపింది. ఆన్లైన్ గేమింగ్స్లో 'ఫిమేల్' అని కనిపించగానే ఆకతాయిలు వేధిస్తుండటంతో... ఆ తర్వాత నుంచి తన జెండర్ను అందులో 'మేల్' అని మార్చినట్లు చెప్పింది. వేధింపుల నుంచి తప్పించుకునేందుకు అదొక్కటే తనకు కనిపించిన మార్గమని చెప్పుకొచ్చింది.

మాట్లాడాల్సిన తరుణం...
కొన్ని నివేదికల ప్రకారం... భారత్లో గత ఏడాది కాలంగా మహిళలు,టీనేజర్ల పట్ల సైబర్ వేధింపులు 36శాతం పెరిగిపోయాయి. అయితే నంబర్స్ సగం స్టోరీ మాత్రమే చెప్తాయని.. దాని తీవ్రత అంతకంటే ఎక్కువే ఉంటుందని సైబర్ సేఫ్టీ నిపుణుడు అకంచ శ్రీవాస్తవ అంటున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ నేపథ్యంలో ఆన్లైన్ మీటింగ్స్ పెరిగాయని... అయితే అందుకు తగినట్లు లైంగిక వేధింపుల నిరోధక పాలసీ(POSH)ని కంపెనీలు అప్డేట్ చేయట్లేదని అంటున్నారు. సైబర్ వేధింపులు మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయని చెప్పారు. కాబట్టి దీనిపై మాట్లాడాల్సిన తరుణం వచ్చిందని... యువతలో దీనిపై అవగాహన కల్పించాలని అన్నారు.












Click it and Unblock the Notifications