ఆంధ్రా వైపు దూసుకొస్తున్న ఫైలిన్, ముందుకు సముద్రం
హైదరాబాద్: ఫైలిన్ తుఫాను ఆంధ్రా తీరం వైపు దూసుకు వస్తోంది. కళింగ పట్నానికి ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది. కళింగపట్నం వద్ద సముద్రపు అలలు భారీగా ఎగిసిపడుతున్నాయి. నలభై అడుగుల మేర సముద్రం ముందుకు వచ్చింది.
దీంతో అధికారులు తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఫైలిన్ తుఫాను రేపు సాయంత్రం నుండి రాత్రి మధ్య పారాదీప్-కళింగపట్నం మధ్య గోపాల్పూర్ సమీపంలో తీరం దాటే అవకాశముంది.

ఫైలిన్ తుఫాను ప్రభావం ఉత్తర కోస్తా జిల్లాలపై ఎక్కువగా ప్రభావం చూపనుంది. తీరం సమీపించే కొద్ది అది బలపడనుంది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు విపత్తు బృందాలను కేంద్రం తరలించింది. కళింగపట్నానికి తూర్పు ఆగ్నేయ ప్రాంతంలో ఫైలిన్ తుఫాను కేంద్రీకృతమై ఉంది.
తుఫాను తీరం దాటే సమయంలో గంటకు దాదాపు రెండు వందల కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముంది. ఫైలిన్ తుఫాన నేపథ్యంలో కళింగపట్నం, భీమిలి, విశాఖ, గంగవరం, కాకినాడ ఓడరేవుల్లో మూడవ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
నిజాంపట్నం, కృష్ణపట్నం, మచిలీపట్నం ఓడరేవుల్లో 2వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. సముద్రంలో వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు అధికారులు సూచించారు.












Click it and Unblock the Notifications