దూసుకొస్తున్న 'ఫణి'
దక్షిణాది రాష్ట్రాలను తుఫాను భయం వణికిస్తోంది. హిందూ మహా సముద్రంతో పాటు దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగళాఖాతంలో గురువారం ఉదయం ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం నాటికి వాయుగుండంగా మారింది. ఇది రానున్న 24 గంటల్లో తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది.

తమిళనాడు దిశగా ఫణి తుఫాను
బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫానుకు ఫణి అని నామకరణం చేశారు. ఇది శ్రీలంక తూర్పు తీరం దిశగా ప్రయాణించి ఏప్రిల్ 30న తమిళనాడు వద్ద తీరాన్ని తాకే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే తమిళనాడుకు దగ్గరగా వచ్చే సమయానికి తుఫాను దిశ మార్చుకుంటుందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. దక్షిణ బంగాళాఖాతంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు తుఫాను బలపడేందుకు సహకరిస్తుందని అంటున్నారు.

తమిళనాడులో రెడ్ అలర్ట్
ఫణి తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశముందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ మేరకు ఈ నెల 30, మే 1వ తేదీల్లో అప్రమత్తంగా ఉండాలని, తమిళనాడు, పుదుచ్ఛేరిలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఫణి ప్రభావంతో ఈ నెల 28 నుంచే తమిళనాడులో వర్షాలు ప్రారంభమవుతాయని, తుఫాను తీరానికి దగ్గరగా వచ్చే కొద్దీ భారీ వానలు పడతాయని ఐఎండీ హెచ్చరించింది. తుఫాను సమయంలో గంటకు 90కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులెవరూ వేటకు వెళ్లవద్దని చెప్పింది. తుఫాను తీరం దిశగా వచ్చే క్రమంలో 28వ తేదీ నుంచి దక్షిణ కోస్తాలో వర్షాలు పడతాయని అధికారులు స్పష్టం చేశారు.

కేరళపై ఫణి ప్రభావం
ఫణి తుఫాను ప్రభావం కేరళ రాష్ట్రంపైనా తీవ్రంగానే ఉండే అవకాశముంది. భారీ వర్షాలతో పాటు గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. గతేడాది వరదల దృష్ట్యా విపత్తు నిర్వాహణ శాఖ ఇప్పటికే అప్రమత్తమైంది. తీరప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. జాలర్లు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించింది.












Click it and Unblock the Notifications