అగ్రవర్ణాల రాళ్ల దాడి: హెల్మెట్తో దళిత వరుడి గుర్రపు స్వారీ
రాట్లమ్ (మధ్యప్రదేశ్): అగ్రవర్ణాలకు చెందినవారు రాళ్ల దాడికి దిగడంతో దళిత వర్గానికి చెందిన పెళ్లి కుమారుడు పెళ్లి ఊరేగింపులో హెల్మెట్ ధరించి గుర్రపు స్వారీ చేయాల్సి వచ్చింది. దళిత పెళ్లికుమారుడిపై రాళ్ల దాడి చేయడమే కాకుండా వాళ్లు గర్రాన్ని తీసుకుని వెళ్లారు.
ఆ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని తాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నెగ్రూన్ గ్రామంలో మే 10వ తేదీన జరిగింది. ఆ దాడిలో ఐదుగురు గాయపడినట్లు, గాయపడినవారిలో అదనపు తహీసల్దార్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. 72 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. నలుగురిపై లూటీ కేసు కూడా పెట్టారు.
పెళ్లి ఊరేగింపులో వరుడు గుర్రంపై స్వారీ చేయడాన్ని అగ్రవర్ణాలకు చెందినవారు వ్యతిరేకించారని, తమ కుటుంబం వరుడి కోసం ఏర్పాటు చేసిన గుర్రాన్ని తీసుకుని వెళ్లారని పెళ్లి కూతురు తండ్రి పురాలాల్ చెప్పారు.
తాము ముందుగానే పోలీసు అధికారులకు చెప్పానని, కొంత మంది పోలీసులు తనతో పాటు వచ్చారని, వరుడు పవన్ గుర్రంపై కూర్చుని స్వారీ మొదలు పెట్టాడని, దాంతో అగ్రవర్ణాలవారు ఇబ్బందికి గురై రాళ్లు విసరడం ప్రారంభించారని ఆయన వివరించారు.
దాంతో పోలీసులు వరుడికి హెల్మెట్ ఇచ్చారు. హెల్మెట్ ధరించిన తర్వాత ఊరేగింపు హెగ్రూన్ స్ట్రీట్ చేరిందని పోలీసులు చెప్పారు. ఊరేగింపు ముగిసి వరుడితో పెళ్లి కూతురు వెళ్లిపోయిన తర్వాత పురలాల్ తాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.