అమానుషం: మంచి బట్టలు, సన్ గ్లాసెస్ పెట్టుకున్నాడని దళితుడిపై దాడి, ఏడుగురిపై కేసు
గాంధీనగర్: మంచి బట్టలు, సన్ గ్లాసులు ధరించాడనే కారణంతో ఓ దళితుడిని చితకబాదారు అగ్రకులాలకు చెందిన వ్యక్తులు. ఈ దారుణ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని బనస్కంత జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు.. ఏడుగురు నిందితులపై కేసు నమోదు చేశారు.
మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను మంచి బట్టలు ధరించడంతోపాటు సన్ గ్లాసెస్ పెట్టుకోవడంతో ఆగ్రహించిన అగ్ర కులానికి చెందిన ఏడుగురు తనను కొట్టారని, తన తల్లిపై కూడా దాడి చేశారని బాధితుడు జిగర్ షేఖాలియా తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

మంగళవారం ఉదయం ఇంటి ముందున్న బాధితుడిని ఏడుగురు నిందితులు అతని వద్దకు వచ్చి దూషించారు. అంతేగాక, ఏంటీ బాగా ఎక్కువగా చేస్తున్నావంటూ.. అతడ్ని చంపుతామని బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ మేరకు బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపాడు. ఆ తర్వాత అదేరోజు రాత్రి రాజ్పుత్ అనే ఇంటిపేరు కలిగిన నిందితులు కర్రలతో బాధితుడిపై దాడి చేశారు.
బాధితుడ్ని కొంతదూరం వరకు ఈడ్చుకెళ్లి మరీ కొట్టారు. ఈ విషయాన్ని గమనించిన బాధితుడి తల్లి.. అతడ్ని కాపాడేందుకు పరుగున వచ్చింది. అయితే, ఆమెను కూడా వేధించిన నిందితులు.. చంపుతామని బెదిరించారు. ఆమె బట్టలను కొంతమేర చించేశారు. ఘటనపై ఫిర్యాదు అందడంతో గోధ్ పోలీస్ స్టేషన్ పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు.
నిందితులపై పలు సెక్షన్ల కింద, ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేశారు. నిందితులను ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. అయితే, నిందితులను పట్టుకుని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications