3గురు దళితులను దుస్తులిప్పేసి కట్టేసి కొట్టారు
జైపూర్: రాజస్థాన్లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. బైక్ ను దొంగిలించారనే నెపంతో ముగ్గురు దళిత యువకులను నగ్నంగా నడి బజారులో చెట్టుకు కట్టేసి చితకబాదారు. దానితో ఆగకుండా మండుటెండలో ఊరేగించారు.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఆ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రాజస్థాన్ రాష్ర్టం చిత్తోర్ ఘఢ్ లోని బస్సీ గ్రామంలో ముగ్గురు దళిత యువకులు ఓ అగ్రకులానికి చెందిన వ్యక్తి బైక్ దొంగలించారనే ఆరోపణలపై వారిని చెట్టుకు కట్టి చితకబాది ఊరిలో నగ్నంగా ఊరేగించారు. ఈ ఘటన శనివారం చోటు చేసుకుంది.
ముగ్గురు దళిత యువకులు బాధతో హాహాకారాలు చేశారు. తమను వదిలిపెట్టాల్సిందిగా చేతులు జోడించి వేడుకున్నారు. అయినా వారు కనికరించలేదు. అగ్ర కులస్తులకు భయపడి ప్రజలు కూడా ప్రేక్షకుల్లా మిగిలిపోయారు. సుమారు అర గంటసేపు ఈ తతంగం నడిచింది.
కాగా, పోలీసులు నిందితులపై ఎలాంటి కేసులు పెట్టకపోగా, దళిత చిన్నారులను అరెస్టు చేసి జువైనల్ హోమ్ కు తరలించారు. అయితే దళిత పిల్లలను కొట్టిన విషయం చైల్డ్ వెల్ఫేర్ మంత్రి అనిత బాదేల్ దాకా చేరింది. దళిత పిల్లలను కొట్టిన వీడియోను తాను చూశానని చిత్తోర్ ఘఢ్ అధికారులతో మాట్లాడానని తెలిపారు.
ఈ ఘటనకు బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురిని అరెస్టు చేసినట్లు తెలుస్తుంది. దళిత పిల్లలు కూడా తమపై ఏవరో దాడి చేశారో గుర్తు పట్టలేకపోతున్నారని అంటున్నారు.