డేంజరస్ డెల్టా వేరియంట్ .. ఇప్పటికే 80 దేశాల్లో .. డబ్ల్యూహెచ్ఓ ఆందోళన
భారతదేశంలో మొదటగా బయటపడిన కోవిడ్ 19 డెల్టా వేరియంట్ భౌగోళిక ఉపద్రవంగా మారుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు 80 దేశాలలో ఈ వేరియంట్ గణనీయంగా పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ వెల్లడించారు.
భారతదేశంలో మొట్టమొదటిసారిగా గుర్తించబడిన కరోనావైరస్ యొక్క డెల్టా వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా ఆధిపత్య వైవిధ్యంగా మారుతోందని ఆమె పేర్కొన్నారు. ఈ వేరియంట్ గణనీయంగా వ్యాప్తి చెందుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతీ వారం విడుదల చేసే కోవిడ్ 19 నివేదికల్లో భాగంగా తాజాగా విడుదల చేసిన నివేదికలో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 80 దేశాలలో డెల్టా వేరియంట్ విజృంభిస్తోంది అని వెల్లడించారు.
అంతేకాదు మరో పన్నెండు దేశాలు , మరి కొన్ని ప్రాంతాలలో బి.1.617 వేరియంట్ బయటపడిందని, అయితే డెల్టా వేరియంట్ బి.1.617.2 మొదట భారతదేశంలోనే గత అక్టోబర్ నెలలో బయటపడిందని సౌమ్య స్వామినాథన్ వెల్లడించారు. కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి విఫల యత్నాలు చేస్తున్న క్రమంలో ఒక చోట నుండి మరొక చోటికి ప్రబలుతున్న వేరియంట్ లతో పరిస్థితి ఇబ్బందికరంగా మారుతోందని, కరోనా మహమ్మారి రోజుకో రూపం తీసుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇక యూకేలో 99% డెల్టా వేరియంట్ వున్నట్టు అక్కడి అధికారులు తెలిపారు అని చెప్పిన సౌమ్య స్వామినాథన్ ప్రస్తుతం వినియోగిస్తున్న వ్యాక్సిన్లు సామర్ధ్యంపై మరింత పరిశోధనలు జరగాలని అభిప్రాయపడ్డారు. మరోపక్క అమెరికాకు సైతం డెల్టా వేరియంట్ తో ముప్పు పొంచి ఉందని సౌమ్య స్వామినాథన్ వెల్లడించారు.