ఆర్ఎస్ఎస్ కొత్త ప్రధాన కార్యదర్శిగా దత్తాత్రేయ హోసబలే ఎన్నిక...
బీజేపీ మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రధాన కార్యదర్శి (సర్ కార్యవహ్)గా కర్ణాటకకు చెందిన దత్తాత్రేయ హోసబలె శనివారం(మార్చి 20) ఎన్నికయ్యారు.మూడేళ్ల కాలవ్యవధితో నాలుగు సార్లు సర్ కార్యవహ్గా పనిచేసిన 73 ఏళ్ల సురేష్ 'భయ్యాజీ' జోషి స్థానంలో... కొత్త సర్ కార్యవహ్గా దత్తాత్రేయ హోసబలే బాధ్యతలు చేపట్టనున్నారు. బెంగళూరులో జరుగుతున్న అఖిల భారతీయ ప్రతినిధి సభ (ఏబీపీఎస్) వార్షిక సమావేశాల్లో సర్ కార్యవహ్ ఎన్నిక జరిగింది. ఏబీపీఎస్ ఆర్ఎస్ఎస్లో అత్యున్నత నిర్ణాయక విభాగంగా ఉన్న సంగతి తెలిసిందే.
ఆర్ఎస్ఎస్లో సర్ సంఘ్చాలక్ (ఆర్ఎస్ఎస్ చీఫ్) తర్వాత నెంబర్ 2గా సర్ కార్యవహ్ వ్యవహరిస్తారు.ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ చీఫ్గా మోహన్ భగవత్ కొనసాగుతున్నారు. తాజాగా సర్ కార్యవహ్గా ఎన్నికైన దత్తాత్రేయ హోసబలె కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా సొరబ్లో జన్మనించారు. ఇంగ్లీష్ లిటరేచర్లో ఆయన పీజీ చేశారు. విద్యార్థి దశలో ఏబీవీపీలో పనిచేశారు. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్లో కార్య నిర్వాహకుడికి స్థాయికి ఎదిగారు. 2009 నుంచి ఆయన ఆర్ఎస్ఎస్ సంయుక్త ప్రధాన కార్యదర్శి (సహ్ కార్యవహ్)గా వ్యవహరిస్తున్నారు. సుదీర్ఘ కాలంగా సంస్థకు ఆయన అందిస్తున్న సేవలను గుర్తించి సర్ కార్యవహ్గా ఎన్నుకున్నారు.

ప్రతీ ఏటా ఏబీపీఎస్ వార్షిక సమావేశం వేర్వేరు చోట్ల జరుగుతుంటుంది. ప్రతీ మూడో సంవత్సరం మాత్రం ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయమైన నాగపూర్లో జరుగుతుంది. అక్కడే సర్కార్యవహ్ ఎన్నిక జరుగుతుంది. కానీ ఈసారి మహారాష్ట్రలో కరోనా పరిస్థితుల రీత్యా ఏబీపీఎస్ సమావేశాన్ని బెంగళూరులో ఏర్పాటు చేశారు.
రెండు రోజుల ఈ సమావేశాల్లో రైతుల అంశం చర్చకు వచ్చింది. చర్చలతోనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని... కొన్ని సమస్యలకైనా పరిష్కారం దొరుకుతుందని పేర్కొంది. పరిష్కారం కోసం జరిపే ప్రయత్నాలను సంఘ వ్యతిరేక, సామాజిక వ్యతిరేక శక్తులు విచ్ఛిన్నం చేసే ప్రమాదం ఉందని కూడా పేర్కొంది.ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్చా అందరికీ ఉంటుందని... అయితే దేశాన్ని అస్థిపరపరచడం, అశాంతిని రేకిత్తించే హక్కు మాత్రం ఎవరికీ లేదని ఆర్ఎస్ఎస్ స్పష్టం చేసింది. నిరసనలు ఏ రూపంలో చేపట్టినా అవి సుదీర్ఘ కాలం కొనసాగరాదని,అది ఏ ఒక్కరి ప్రయోజనాలకు మంచిది కాదని అభిప్రాయపడింది.












Click it and Unblock the Notifications