మోడీ పర్యటన: 1,000 కోట్ల దావూద్ ఆస్తుల సీజ్..!
న్యూఢిల్లీ: ముంబై అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన లండన్ ఆస్తులను లండన్లో సీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటి మొత్తం విలువ సుమారు రూ. 1000 కోట్లుగా ఉంటుందని అంచనా. దావూద్కు సంబంధించిన ఆస్తులపై విచారణ జరపాలని కేంద్రం ఎన్ఫోర్స్ డైరెక్టరేట్ను గతంలో ఆదేశించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో భారత్లోను, యూరప్లోను డాన్ ఆస్తులు ఉన్నట్టు ఈడీ గుర్తించింది. ఈ క్రమంలో దావూద్ ఇబ్రహీంకు చెందిన లండన్ ఆస్తులకు సంబంధించిన వివరాలను భారత్ అక్కడ ఏజెన్సీకి అప్పగించింది. భారత్తో పాటు ప్రపంచ వ్యాప్తంగా దావూద్ ఇబ్రహీంకు సంబంధించిన కార్యకలాపాలను అతడి అనుచరుడు ఇక్బాల్ మిర్చి చూసేవాడు.
అయితే 2013 ఆగస్టులో ఇక్బాల్ మిర్చి లండన్లో మరణించాడు. ఈ క్రమంలో లండన్లో గుర్తించిన దావూద్ ఇబ్రహీంకు చెందిన పది ఆస్తులను సీజ్ చేయనున్నారు. ఈ ఏడాది నవంబర్లో ప్రధాని నరేంద్రమోడీ లండన్ పర్యటటను దృష్టిలో పెట్టుకుని బ్రిటిష్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకందని తెలుస్తోంది. అంతేకాదు లండన్లో సీజ్ చేసిన దావుద్ ఆస్తులను భారత్ అధికారులకు అప్పగించనున్నారు.
ఇటీవలే ప్రధాని నరేంద్రమోడీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటనకు వెళ్లినప్పుడు ఈ విషయంపై అక్కడ చర్చించారు. ఈడీ సమాచారం మేరకు లండన్లోని హెర్బర్ట్ రోడ్, సెయింట్ జాన్ వుడ్ రోడ్, హార్న చర్చ్, ఎస్సెక్స్, రిచమండ్ రోడ్, టామ్స్ ఉడ్ రోడ్, చిగ్ వెల్, రోస్ హామ్టన్ హై స్ట్రీట్, లండన్, లాన్సీలాట్ రోడ్, థార్టన్ రోడ్, స్పైటల్ స్ట్రీట్, డార్ట్ ఫోర్ట్లలో దావూద్ తన ఆస్తులను కలిగి ఉన్నాడు.
భారత్లోని ముంబైలాంటి నగరాల్లో దావూద్కు కోట్లాది రూపాయల విలువ చేసే భవనాలు, హోటళ్ళు వంటి ఆస్తులున్నాయి. ముంబైలోని వర్లీ, అంధేరీ ఈస్ట్, మహిమ్, వెస్ట్ శాంతాక్రజ్లో జుహూ తారా రోడ్డులో ఓ హోటల్ ఉన్నట్టు గతంలో ఈడీ ఆధారాలను సేకరించింది.
వీటన్నింటిని వెయ్యి కోట్లకు అమ్మేసి, ఆ సొమ్మును యూరప్ దేశాల్లో ఇతర ఆస్తుల కోసం పెట్టుబడిగా పెట్టాడని వార్తలు కూడా వచ్చాయి. భారత్తో పాటు ప్రపంచ వ్యాప్తంగా దావూద్ ఇబ్రహీంకు సంబంధించిన కార్యకలాపాలను చూసే అతని అనుచరుడు మిర్చికి కూడా సైప్రస్, బ్రిటన్, మొరాకో, టర్కీ వంటి దేశాల్లో ఆస్తులున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా దావూద్ గ్యాంగ్ ఆస్తుల విలువ సుమారు రూ. 3,000 కోట్లు ఉంటుందని సమాచారం. దావూద్ ఇబ్రహీం తన పెట్టుబడులను సైప్రస్, బ్రిటన్, మొరాకో, టర్కీ, పాకిస్థాన్, థాయ్లాండ్, ఇండియా, స్పెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లలో పెట్టినట్లు ఈడీ ఆధారాలను సేకరించింది.
పది దేశాల్లో దావూద్ గ్యాంగ్కు 50 వరకు ఆస్తులు ఉన్నాయి. అన్ని ఆస్తులను కూడా బినామీ పేర్లతో వీరు కొనుగోలు చేశారు. వీటన్నింటిని కూడా దావూద్ ఇబ్రహీం అనుచరుడు ఇక్బాల్ మిర్చి కొనుగోలు చేసినట్లు సమాచారం.