ఢిల్లీలో విధ్వంసానికి దావూద్ కుట్ర: భీకర పేలుళ్లకు ప్లాన్?
న్యూఢిల్లీ: దేశ వాణిజ్య రాజధాని ముంబైలో మారణహోమం సృష్టించిన అండర్ వరల్డ్ డాన్, భారత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం దేశంలోని మరో ముఖ్య పట్టణంపై గురిపెట్టినట్లు సమాచారం. పాకిస్థాన్ నగరం కరాచీలో నిక్షేపంగానే ఉన్న విషయం తెలిసిందే.
పాక్ పోలీసుల నిఘాలో స్వేచ్ఛగా సంచరిస్తున్న దావూద్... భారత్ను అస్థిరపరిచే కుట్రలకు ఎప్పటికప్పుడు కొత్త పథకాలు రచిస్తూనే ఉన్నాడు. తాజాగా దావూద్ తన సన్నిహితులతో మాట్లాడిన ఫోన్ కాల్స్ను సేకరించిన భారత ఇంటెలిజెన్స్ బ్యూరో ఓ సంచలన విషయాన్ని బయటపెట్టింది.
దేశ రాజధాని ఢిల్లీలో భీకర దాడులకు అతడు పన్నాగం పన్నాడని ఐబీ తన నివేదికలో ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఇందులో భాగంగా ఇప్పటికే తన 'డీ' కంపెనీలోని పలువురు వ్యక్తులను దావూద్ రంగంలోకి దింపాడని కూడా ఆ కథనం పేర్కొంది.
ఐబీ నివేదిక నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ప్రధానంగా ఎయిర్ పోర్టు, మెట్రో, విధాన్ సభ, ఢిల్లీ రైల్వే స్టేషన్లలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ సమాచారంతో దేశంలోని ఇతర ముఖ్య పట్టణాల భద్రతా దళాలు కూడా అప్రమత్తమయ్యాయి.