నిన్న అరెస్టు, బెయిల్ తిరస్కరణ - నేడు ఆస్పత్రికి- క్షణక్షణం బెంగాల్ రాజకీయం
పశ్చిమబెంగాల్లో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. నిన్న ఉదయం నారదా స్టింగ్ ఆపరేషన్ కేసులో సీబీఐ ఇద్దరు టీఎంసీ మంత్రులు ఫిర్హద్ హకీమ్, సుబ్రతో ముఖర్జీలతో పాటు ఎమ్మెల్యే మదన్ మిత్రా, కోల్కతా మాజీ మేయర్ సోవన్ ఛటర్జీలను అరెస్టు చేసింది. దీనికి నిరసనగా కోల్కతా సీబీఐ కార్యాలయంపై టీఎంసీ రాళ్లదాడి చేయడంతో పాటు సీఎం మమతా బెనర్జీ నేరుగా వెళ్లి సీబీఐ అధికారులతో వాగ్వాదానికి దిగారు.
సీబీఐ అరెస్టు చేసిన టీఎంసీ నేతలకు సీబీఐ కోర్టు బెయిల్ తిరస్కరించింది. దీంతో వీరు సీబీఐ కస్టడీలోకి వెళ్లడం ఖాయంగా కనిపించింది. అయితే ఇవాళ వీరిలో మంత్రి సుబ్రతో ముఖర్జీతో పాటు ఎమ్మెల్యే మదన్ మిత్రా, మాజీ మేయర్ సోవన్ ఛటర్జీ అనారోగ్యకారణాలతో ఆస్పత్రిలో చేరిపోయారు. మరో మంత్రి ఫిర్హద్ హకీమ్ మాత్రం ప్రెసిడెన్సీ జైల్లోనే ఉన్నారు. అనారోగ్య కారణాలు చూపడంతో వీరిని జైలు నుంచి ఆస్పత్రికి తరలించేందుకు సీబీఐ కోర్టు అనుమతిచ్చినట్లు తెలుస్తోంది.
నిన్న ఉదయం ఆరోగ్యంగానే ఉండి సీబీఐ అరెస్టు చేసిన తర్వాత బెయిల్ కోసం ప్రయత్నించి అది కుదరకపోవడంతో రాత్రికి అనారోగ్యం పాలైన ముగ్గురు టీఎంసీ నేతల వ్యవహారం చర్చనీయాంశమవుతోంది. బీజేపీ నేతలు టీఎంసీ వైఖరిని తీవ్రంగా తప్పుబడుతున్నారు. గవర్నర్ జగ్దీప్ ధన్కర్ కూడా సీఎం మమతా బెనర్జీపైనే నేరుగా విమర్శలకు దిగుతున్నారు. దీంతో 24 గంటల వ్యవధిలోనే బెంగాల్లో పరిణామాలు వేగంగా మారిపోయాయి.