ఆర్మీ హెలికాఫ్టర్ దుర్ఘటన-13కు చేరిన మృతులు-మహిళ మృతదేహం గుర్తింపు
ఇవాళ తమిళనాడులోని కూనూర్ లో జరిగిన ఆర్మీ హెలికాఫ్టర్ దుర్ఘటనలో ఎవరూ బతికి ఉండే అవకాశాలు కనిపించడం లేదు. ఉదయం ప్రమాదం జరిగిన తర్వాత క్షతగాత్రుల్ని స్ధానిక వెల్లింగ్టన్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే వీరిలో ఇప్పటికే దాదాపుగా అందరూ చనిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ 13 మంది మృతిచెందినట్లు అధికారులు తాజాగా నిర్ధారించారు.
ఆర్మీ హెలికాఫ్టర్ లో ఇద్దరు సిబ్బందితో పాటు మొత్తం 14 మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికా రావత్ తో పాటు ఇతర సైనిక అధికారులు, సహాయక సిబ్బంది ఉన్నారు. ప్రమాదంలో వీరంతా మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. ఘటనా స్ధలి నుంచి తాజాగా ఓ మహిళ మృతదేహం వెలికితీసినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో హెలికాఫ్టర్ లో ప్రయాణించిన ఏకైక మహిళ మధులికా రావతే కావడంతో ఆమె చనిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఈ అంశాన్ని ఆర్మీ కానీ కేంద్రం కానీ ఇప్పటివరకూ ధృవీకరించలేదు.
ఇప్పటివరకూ ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో నిర్ధారణ అయిన తర్వాతే కేంద్రంతో పాటు ఆర్మీ కూడా దీనిపై స్పష్టమైన ప్రకటనలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బిపిన్ రావత్ త్రివిధ దళాధిపతి కావడం, అత్యున్నత స్ధాయిలో ఉన్న వారిపై తొందరపడి ఏదో ఒక ప్రకటన చేస్తే ఇబ్బందులు తప్పవని భావిస్తున్నకేంద్రం.. అన్నీ నిర్ధారించుకున్నాకే తుది ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పార్లమెంటులో ప్రకటన చేసే విషయంలో కేంద్రం తొందరపడటం లేదు అంతకుముందే రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆర్మీఅధికారులతో సమావేశమై వివరాలు తీసుకున్నాక బిపిన్ రావత్ ఇంటికి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రోటోకాల్ ప్రకారం అత్యున్నత స్ధాయి అధికారులు ప్రమాదానికి గురైనప్పుడు వారి కుటుంబ సభ్యులకు ముందుగా సమాచారం ఇచ్చిన తర్వాతే బహిరంగ పర్చాల్సి ఉంటుంది. దీంతో ఇప్పుడు రాజ్ నాథ్ సింగ్ బిపిన్ రావత్ ఇంటికి వెళ్లడంపై చర్చ జరుగుతోంది. డీఎన్ఎ పరీక్షలు ముగిసిన తర్వాతే రాజ్ నాథ్ ప్రకటన చేసే అవకాశముంది.