నాడు 85 వేల మంది.. నేడు పదుల సంఖ్యలో మృతి... పీవోకేలోనే భూకంపాలు ఎందుకు..?
పాక్ ఆక్రమిత కశ్మీర్లోని న్యూ మిర్సిటీలో వచ్చిన భూప్రకంపనాలతో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. 19 మంది చనిపోయినట్టు పాకిస్థాన్ అధికార వర్గాలు ధ్రువీకరించాయి. మరో 300 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు వివరించాయి.
19 మంది మృతి
మంగళవారం సాయంత్రం 4.32 గంటలకు 5.8 తీవ్రతతో భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. భూ ప్రకంపనాలు జమ్ముకశ్మీర్, పంజాబ్, ఢిల్లీ వరకు ప్రభావం చూపాయి. శ్రీనగర్ నుంచి 140 కిలోమీటర్ల దూరంలో గల న్యూ మిర్పూర్ సిటీ భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు ధ్రువీకరించారు. దాదాపు 10 కిలోమీటర్ల లోతు వరకు భూకంపం ప్రభావం చూపిందని అమెరికా జియోలాజికల్ సర్వే పేర్కొన్నది.
ఫోటోలు, వీడియోలు
భూకంపం సంభవించిన వెంటనే సోషల్ మీడియోలో ఫోటోలు, వీడియోలను షేర్ చేశారు. రహదారులు నిట్టనిలువునా చీలి ఉండగా .. కార్లు అందులో పడి ఉండి కనిపించాయి. భవనాలు కూలిపోయాయి. ఇళ్లపై ఉన్న పైకప్పులు ఎగిరిపోయాయి. గోడలు కూడా కూలి .. నేలమట్ట అయ్యాయి. మరోవైపు జీలం నదీ పైన గల రహదారిపై కూడా భూకంపం ప్రభావం చూపింది. దీంతో ఆ పరిసరాల్లో ఉన్న ప్రజలు ఇబ్బంది పడ్డారు. మరోవైపు మంగళ డ్యాంను మూసివేశారు. పీవోకేలో పాకిస్థాన్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఆర్మీని రంగంలోకి దింపి .. సహాయ చర్యలను పర్యవేక్షిస్తోంది.
85 వేల మంది
మరోవైపు 14 ఏళ్ల క్రితం వచ్చిన భూకంపం బీభత్సాన్ని సృష్టించింది. దాదాపు 85 వేల మందిని పొట్టనపెట్టుకుంది. పీవోకేలో 7.6 తీవ్రతతో భూకంపం వచ్చింది. భూకంప కేంద్ర ముజఫరాబాద్ వద్ద గుర్తించారు. న్యూ మిర్పూర్ సిటీకి ముజఫర్ బాద్ గల దూరం కేవలం 250 కిలోమీటర్ల దూరం ఉండటం విశేషం. మొత్తం 87 వేల 350 మంది చనిపోగా .. ఇందులో 19 వేల మంది చిన్నారులే ఉన్నారు. వీరంతా పాఠశాలలో ఉండి .. చనిపోయారని అధికారులు పేర్కొన్నారు.