ఘోరం: రూ.లక్ష తిరిగివ్వమన్నందుకు మహిళను ముక్కలు చేసి సూట్ కేసులో కుక్కాడు
కోల్కతా: ఇటీవల హైదరాబాద్ నగరంలో చోటు చేసుకున్న ఘటన లాంటి దారుణమే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఓ మహిళను దారుణంగా హత్య చేసిన సహోద్యోగి.. ఆ తర్వాత ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి సూట్ కేసులో కుక్కాడు. ఘటనపై నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శిల్ప అగర్వాల్ అనే మహిళ బంకురా జిల్లా మేజియాలోని జాతీయ బ్యాంకు సహాయక కేంద్రంలో కస్టమర్ కేర్ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తోంది. ఈ కేసులో అరెస్టయిన రాజీవ్ కుమార్ అదే ఆఫీసులో మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నాడు.
ఇంటికి తిరిగి రాలేదు
శనివారం పశ్చిమబుర్ద్వాన్ జిల్లాలోని ఆసన్సోల్లోని తన బంధువుల ఇంటికి వెళుతున్నట్లు చెప్పిన శిల్ప గురించి ఆ తర్వాత ఎటువంటి సమాచారం లేకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు.
దుర్వాసన రావడంతో..
కాగా, రాజీవ్ కుమార్ అపార్ట్మెంట్లోని స్టోర్ ఏరియా నుంచి దుర్వాసన వెదజల్లుతుండటంతో ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడకు చేరకున్న పోలీసులు.. శిల్ప మృతదేహం ఉన్న సూట్ కేసును బయటికి తీశారు.
ముక్కలు ముక్కలుగా..
ఆమెను శిల్పగా గుర్తించిన పోలీసులు.. కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. సూట్ కేసులో శిల్ప మృతదేహం ముక్కలు ముక్కలు కోసి ఉందని పోలీసులు తెలిపారు.
రూ. లక్ష తిరిగివ్వమన్నందుకే..
శిల్ప వద్ద నుంచి బ్యాంకు మేనేజర్ రాజీవ్ కుమార్ రూ.లక్ష రూపాయలు అప్పుగా తీసుకున్నాడని.. తిరిగి ఇవ్వమన్నందుకే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. నిందితుడు రాజీవ్, అతని భార్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.