వీడియో వైరల్: జింకను తరుముకొచ్చిన చిరుత..ప్రాణాలు కాపాడుకునే క్రమంలో..అయ్యో పాపం..!
ముంబై: దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలులో ఉండటంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. దీంతో ఆయా ఊర్లకు దగ్గరలో ఉన్న అటవీప్రాంతాల నుంచి జంతువులు నివాస ప్రాంతాల్లోకి వచ్చేస్తున్నాయి. ఇప్పటికే పలు జంతువులు రోడ్లమీద బహిరంగంగా సంచరిస్తుండటం చూశాము. అలాంటి వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సాధారణ రోజుల్లో నిత్యం రద్దీగా ఉండే తిరుమల ఘాట్ రోడ్లు ఇప్పుడు నిర్మానుష్యంగా మారడంతో జింకలు గుంపులు గుంపులుగా వచ్చేస్తున్నాయి. మరి కొన్ని చోట్లు ఏనుగులు దర్శనమిస్తున్నాయి. తాజాగా ముంబైలోని ఓ ఇంట్లోకి ఏకంగా ఓ జింక చేరింది. ఇది చూసి చాలామంది ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక ఈ జింక ఎలా అక్కడికి చేరిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
Recommended Video
ఇంట్లో చిక్కుకుపోయిన జింక
ముంబైలో ఐఐటీ క్యాంపస్కు సమీపంలో ఉండే ఓ స్లమ్ ఏరియాలోని ఇంట్లో జింక హల్చల్ చేసింది. అసలు జింక ఆ ఇంట్లోకి ఎలా ప్రవేశించిందో తెలిస్తే ముందుగా ఆశ్చర్యానికి గురవుతారు. ఈ జింకను ఓ చిరుత పులి తరుముకొచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. తన ప్రాణాలు కాపాడుకునేందుకు జింక ఓ ఇంటి పైకి ఎక్కింది. చంగు చంగుమని పరుగులు తీస్తున్న ఈ జింక ఒక్కసారిగా ఓ ఇంటి పైకప్పు నుంచి ఏకంగా ఇంట్లోకి పడిపోయింది. పై నుంచి కిందకు పడటంతో ఆ జింక కాలుకు గాయమైంది. ఇక అక్కడి నుంచి పారిపోయే స్కోప్ లేకపోయింది ఆ జింకకు. రక్తమోడుతున్న కాలుతో కదలలేక చాలా అవస్తలు పడింది. జింకను చూసిన వారు దాన్ని రక్షించే ప్రయత్నం చేశారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
హఠాత్తుగా పైకప్పు నుంచి కిందకు..
ఇంటికి చేరుకున్న అటవీశాఖ అధికారులు జింకను పట్టుకున్నారు. తాము రాత్రి భోజనం చేశాక టీవీ చూస్తున్న సమయంలో హఠాత్తుగా జింక పైకప్పు నుంచి ఇంట్లోకి పడిపోయిందని ముందుగా దీన్ని చూసి భయపడినట్లు చెప్పారు ఇంట్లో నివాసం ఉండేవారు. ఇక ఒక మూలకు కూర్చున్న జింకను చూసి తమ సెల్ఫోన్లో రికార్డు చేశామని చెప్పారు. అయితే వీరున్న ప్రాంతంకు దగ్గరలో జలపాతం ఉందని అక్కడ నీరు తాగేందుకు ఈ జింక వచ్చి ఉండొచ్చని చెప్పారు. నీళ్లు తాగే సమయంలో కుక్క కానీ, చిరుత కానీ తరిమి ఉంటుందనే అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ప్రాణాలు కాపాడుకునేందుకు ఈ జింక నివాసప్రాంతానికి పరుగులు తీసి ఇలా చిక్కుకుందని వెల్లడించారు.
గాయలతో జింక..
ఇక అటవీశాఖ సిబ్బంది చేరుకునే సమయానికి ఈ జింక నిలబడేందుకు చాలా ప్రయత్నించినప్పటికీ కిందపడిపోతూ కనిపించింది. కాలుకు గాయం అవడంతో నిలవలేక పోయిందని ఇంట్లోవారు చెప్పారు. తమను చూసి బెదిరిపోయిన జింక పాకుకుంటూనే బాత్రూంలోకి వెళ్లిందని ఆ తర్వాత ఇంట్లో ఓ మూలకు ఆగిపోయిందని వెల్లడించారు. ఇక వల వేసి జింకను పట్టుకున్నట్లు అటవీశాఖ అధికారులు చెప్పారు. అనంతరం చికిత్స కోసం హాస్పిటల్కు తరలించగా ప్రస్తుతం ఆ జింక గాయం నుంచి కోలుకుంటోంది.