చైనాతో తాజా ప్రతిష్టంభన- లడఖ్ వ్యూహంపై రాజ్నాథ్ అత్యున్నత భేటీ... ఏం జరుగుతోంది ?
గల్వాన్ లోయ ఘటన తర్వాత కొంతకాలం పాటు నివురుగప్పిన నిప్పులా ఉన్న భారత్-చైనా ఉద్రిక్తతలు తాజాగా తూర్పు లడఖ్లోని పాగ్యాంగ్ త్సో సరస్సు కేంద్రంగా మరోసారి బయటపడ్డాయి. సోమవారం ఈ సరస్సు సమీపంలో దాదాపు 500 మంది చైనా బలగాలు ఏకపక్షంగా కవ్వింపు చర్యలకు దిగడంతో పరిస్ధితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. అయితే చైనా తమ బలగాలు ఎలాంటి కవ్వింపు చర్యలకు దిగలేదని ప్రకటించింది. తమ బలగాలు వాస్తవాధీన రేఖ దాటి పాంగ్యాంగ్ సరస్సు వద్ద ప్రాంతాన్ని ఆక్రమించినట్లు భారత్ చేస్తున్న ఆరోపణల్లోవాస్తవం లేదని చైనా విదేశాంగ ప్రతినిధి వెల్లడించారు. కానీ క్షేత్రస్ధాయిలో మాత్రం పరిస్ధితులు ఉద్రిక్తంగానే ఉన్నాయి.
Recommended Video
ఈ నేపథ్యంలో వాస్తవాధీన రేఖ వెంబడి తూర్పు లడఖ్లో తాజా పరిస్ధితిని అంచనా వేయడంతో పాటు భవిష్యత్ వ్యూహాన్ని రూపొందించేందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అత్యున్నత స్ధాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో త్రివిధ దళాల అధిపతులతో పాటు సీడీఎస్ బిపిన్ రావత్ కూడా పాల్గొంటున్నారు. వీరితో పాటు మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ పరమ్ జీత్ సింగ్ కూడా హాజరయ్యారు.

పాంగ్యాంగ్ సరస్సు కేంద్రంగా తాజా ప్రతిష్టంభన నేపథ్యంలో చైనాతో చర్చల ప్రక్రియను ఎలా ముందుకు తీసుకువెళ్లాలి, వాస్తవాధీన రేఖ వెంబడి తీసుకోవాల్సిన చర్యలపై రాజ్నాథ్ ఈ భేటీలో సైనిక పెద్దల అభిప్రాయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications