సరిహద్దులో ఉద్రిక్తతల వేళ... ఆయుధ కొనుగోళ్లకు రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్... వేటికెంత ఖర్చు...
సరిహద్దులో చైనాతో ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమవుతుందో తెలియని పరిస్థితుల్లో భారత రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భారత సాయుధ దళాలకు అవసరమయ్యే ఆయుధ కొనుగోళ్లకు ఆమోద ముద్ర వేసింది. ఇందుకోసం రూ.2290 కోట్ల నిధుల మంజూరుకు రక్షణ కొనుగోళ్ల కౌన్సిల్(DAC) ఆమోద ముద్ర వేసింది. ఇందులో అమెరికాతో 72వేల సిగ్ సావర్ అసాల్ట్ రైఫిల్స్ డీల్ కూడా ఉంది. ఈ మేరకు సోమవారం(సెప్టెంబర్ 28) రక్షణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.

దేశీ,విదేశీ కంపెనీల నుంచి...
'కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో సోమవారం రక్షణ కొనుగోళ్ల కౌన్సిల్(DAC) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భారత సాయుధ దళాలకు అవసరమైన రక్షణ సామాగ్రి కొనుగోళ్లకు రూ.2290 కోట్ల విలువైన ప్రతిపాదనలకు డీఏసీ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం దేశీ కంపెనీలతో పాటు విదేశీ కంపెనీల నుంచి ఆయుధ కొనుగోళ్లు జరపవచ్చు.' అని రక్షణ శాఖ తమ ప్రకటనలో పేర్కొంది.

ఏయే పరికరాలకు ఎంత...
తాజాగా కేటాయించిన నిధుల్లో బై ఇండియన్ (ఐడీడీఎం) కేటగిరీ కింద రూ.1,510 కోట్ల వ్యయంతో స్టాటిక్ హెచ్ఎఫ్ టాన్స్-రిసీవర్ సెట్లు, స్మార్ట్ యాంటీ ఎయిర్ఫీల్డ్ వెపన్ (సావా) కొనుగోలుకు డీఏసీ ఆమోదం తెలిపింది. అలాగే భారత ఆర్మీ,వైమానిక దళ ఫీల్డ్ యూనిట్ల మధ్య కమ్యూనికేషన్ కోసం సుమారు రూ.540 కోట్ల వ్యయంతో హెచ్ఎఫ్ రేడియో సెట్ల కొనుగోలుకు ఆమోదం తెలిపింది. స్మార్ట్ యాంటీ ఎయిర్ఫీల్డ్ వెపన్ కొనుగోళ్లకు రూ .970 కోట్లకు ఆమోదం తెలిపింది. ఈ అత్యాధునిక పరికరాలతో నేవీ, వైమానిక దళాల శక్తి మరింత పెరగనుందని పేర్కొంది.

అమెరికాతో ఒప్పందం...
ఫ్రంట్ లైన్ దళాలకు అవసరయ్యే సిగ్ సావర్ అసాల్ట్ రైఫిల్స్ కొనుగోళ్లకు రూ.780కోట్లకు ఆమోదం తెలిపింది. పదాతిదళం ఆధునీకరణకు 2019 ప్రారంభంలో అమెరికాతో 72400 అసాల్ట్ రైఫిల్స్ కొనుగోళ్లకు కుదుర్చుకున్న ఒప్పందానికి తాజా ప్రతిపాదనలు కొనసాగింపు అని చెప్పాలి. భారత రక్షణ వ్యవస్థ బలోపేతంలో భాగంగానే ఈ ప్రతిపాదనలను సిద్దం చేశారు. అత్యధిక సైనిక బలగాలు ఉన్న రెండో అతిపెద్ద దేశంగా భారత్ గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. అయితే భారత సైన్యం ఇప్పటికీ పాత ఆయుధాలనే ఉపయోగిస్తోందన్న అపప్రద ఉన్నది. సైన్యం ఉపయోగిస్తున్న పాత ఆయుధాలకు స్వస్తి పలికే క్రమంలో కొత్తగా ఆయుధ కొనుగోళ్లను జరుపుతోంది. పాకిస్థాన్, చైనాలకు దీటుగా సమాధానం ఇవ్వడంతోపాటు, రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా గత రెండేళ్లుగా ఆయుధ కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేసింది.
Recommended Video

కొత్త విధానం అమల్లోకి...
మరోవైపు దేశ రక్షణ రంగానికి అవసరమైన పరికరాల కొనుగోళ్లకు ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. త్రివిధ దళాల ఆయుధ కొనుగోళ్ల విధానాలను సులభతరం చేసేందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చారు. దీని ప్రకారం వచ్చే ఐదేళ్లలో 130బిలియన్ డాలర్ల విలువైన ఆయుధ కొనుగోళ్లను భారత్ చేపట్టవచ్చునని తెలుస్తోంది. తాజా డీఏసీ సమావేశంలో కేంద్రమంత్రి రాజ్నాథ్తో పాటు సీడీఎస్ బిపిన్ రావత్,ఆర్మీ చీఫ్ నవరణే,ఎయిర్ఫోర్స్ చీఫ్ బదౌరియా,నేవీ చీఫ్ కరమ్ బీర్ పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications